స్నేహితులతో పందెం కాసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఇంటర్ విద్యార్థి

  • యాభై రూపాయల పందెం కోసం పెన్ను మింగిన విద్యార్థి
  • మూడేళ్ల తర్వాత తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిక
  • విషయం బయటపెట్టిన స్నేహితులు.. నిర్ధారించిన వైద్యులు
  • గుంటూరు జీజీహెచ్‌లో ఆపరేషన్ లేకుండా ఎండోస్కోపీ ద్వారా పెన్ను వెలికితీత
కేవలం రూ.50 పందెం కోసం ఓ విద్యార్థి చేసిన పని అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు పెన్ను మింగేయగా.. అది మూడేళ్లపాటు కడుపులోనే ఉండిపోయింది. తాజాగా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్‌) వైద్యులు అత్యాధునిక విధానంలో పెన్నును వెలికితీసి ప్రాణాపాయం తప్పించారు.  
అస‌లేం జ‌రిగిందంటే..!
గుంటూరులోని కొత్తపేటకు చెందిన శ్రీనివాసరావు, లక్ష్మీ సుజాత దంపతుల కుమారుడు మురళీకృష్ణ ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడేళ్ల క్రితం అంటే తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో స్నేహితులతో సరదాగా రూ.50 పందెం కాసి ఓ పెన్నును మింగేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్య రాలేదు. అయితే, తల్లిదండ్రులకు చెబితే తిడతారన్న భయంతో ఆ విషయాన్ని దాచిపెట్టాడు.

గత ఏడాది కాలంగా అప్పుడప్పుడు కడుపునొప్పి వస్తున్నా మందులతో సరిపెట్టుకున్నాడు. కానీ, డిసెంబరు 18న నొప్పి భరించలేనంతగా మారడంతో విషయం స్నేహితుల ద్వారా తల్లిదండ్రులకు తెలిసింది. వెంటనే వారు మురళీకృష్ణను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యులు సీటీ స్కాన్‌ తీయగా.. పెద్దపేగులో పెన్ను ఇరుక్కున్నట్లు గుర్తించారు.

సాధారణంగా ఇలాంటి కేసుల్లో సర్జరీ చేయాల్సి ఉంటుంది. కానీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు ఎలాంటి కోత లేకుండా 'రెట్రో గ్రేడ్‌ ఎంటెరోస్కోపీ విత్‌ ఓవర్‌ ట్యూబ్‌' అనే ఆధునిక పద్ధతిని ఉపయోగించి పెన్నును విజయవంతంగా బయటకు తీశారు. మూడేళ్ల పాటు కడుపులో ఉన్న పెన్ను బయటకు రావడంతో విద్యార్థి కోలుకుంటున్నాడు. క్లిష్టమైన ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్‌ ప్రత్యేకంగా అభినందించారు.


More Telugu News