Stock Market: 2025కు లాభాలతో వీడ్కోలు పలికిన స్టాక్ మార్కెట్

Stock Market Ends 2025 with Gains
షార్ట్స్‌లో చూడండి
2025 క్యాలెండర్ ఇయర్‌కు భారత స్టాక్ మార్కెట్లు ఘనంగా వీడ్కోలు పలికాయి. బుధవారం జరిగిన ఏడాది చివరి ట్రేడింగ్ సెషన్‌లో సూచీలు లాభాలతో ముగిశాయి. ఐటీ షేర్లు స్వల్పంగా నీరసించినప్పటికీ... మిగిలిన అన్ని ప్రధాన రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు ఉత్సాహంగా కదిలాయి.

ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 545.52 పాయింట్లు లాభపడి 85,220.6 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 190.75 పాయింట్లు ఎగబాకి 26,129.6 వద్ద ముగిసింది. దీంతో నిఫ్టీ వరుసగా పదో ఏడాది కూడా ఇన్వెస్టర్లకు లాభాలను అందించినట్లయింది. 2025లో నిఫ్టీ మొత్తంగా 10.5 శాతం లాభపడగా, సెన్సెక్స్ 9.06 శాతం వార్షిక రాబడిని నమోదు చేసింది.

రంగాల వారీగా..
బీఎస్ఈలో టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు అత్యధిక లాభాలను ఆర్జించాయి. మరోవైపు టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటి టెక్నాలజీ షేర్లతో పాటు బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. 

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 2.66 శాతం పెరిగి మార్కెట్ ర్యాలీకి నాయకత్వం వహించింది. బ్యాంకింగ్, రియల్టీ, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. ఐటీ రంగం మాత్రం 0.3 శాతం వెనకబడింది.

మార్కెట్ అవుట్‌లుక్
నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ ఈ ఏడాది 5.7 శాతం లాభపడి వరుసగా ఆరో ఏడాది లాభాల్లో నిలిచింది. అయితే స్మాల్‌క్యాప్ సూచీ మాత్రం 2025లో 5.6 శాతం నష్టపోయింది. ప్రస్తుతం నిఫ్టీ 26,000 మార్క్ పైన స్థిరంగా కొనసాగడం సానుకూల అంశమని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. 26,200–26,230 స్థాయిని దాటితే నిఫ్టీ తన ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి అయిన 26,320ని మళ్లీ పరీక్షించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.


Go Back to Shorts
Stock Market
Sensex
Nifty
Indian Stock Market
Share Market
Stock Trading
Investment
BSE
NSE
Market Outlook

More Telugu News