నితీశ్ కుమార్ హిజాబ్ తొలగించిన అంశం.. విధుల్లో చేరని డాక్టర్ నుస్రత్ పర్వీన్

  • నియామక పత్రాల పంపిణీ సమయంలో హిజాబ్ తొలగించే ప్రయత్నం చేసిన సీఎం
  • నేటితో గడువు ముగుస్తున్నప్పటికీ నుస్రత్ పర్వీన్ పోస్టింగ్‌లో చేరని వైనం
  • నేడు పోస్టింగ్‌లో చేరకుంటే నియామకం రద్దవుతుందన్న అధికారులు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల ఉద్యోగ నియమక పత్రాల పంపిణీ సమయంలో ఒక మహిళ హిజాబ్‌ను తొలగించే ప్రయత్నం చేసిన విషయం విదితమే. ఈ ఘటనతో ఇబ్బందిపడిన ఆయుష్ వైద్యురాలు సుస్రత్ పర్వీన్, నేటితో గడువు ముగిసినప్పటికీ ఇంకా పోస్టింగ్‌లో చేరలేదని అధికారులు చెబుతున్నారు. నియామక పత్రాలు అందుకున్న ఆయుష్ వైద్యులు పోస్టింగ్‌లో చేరడానికి డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు.

గడువులోగా పోస్టింగ్‌లో చేరకుంటే నియామకం రద్దవుతుందని అధికారులు చెబుతున్నారు. సుస్రత్ పర్వీన్‌కు సబల్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఆమె నుంచి లేదా ఆమె కుటుంబం నుంచి ఎటువంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు.

సమాచారం మేరకు, హిజాబ్ వివాదం అనంతరం పర్వీన్, ఆమె కుటుంబం పాట్నా నుంచి కోల్‌కతాకు మకాం మార్చారు. ఈ ఘటన తర్వాత, ఆమె బయటకు వెళ్లకుండా, మీడియాతో మాట్లాడకుండా ఆమె భర్త ఆజ్ఞాపించినట్లు తెలుస్తోంది.

పర్వీన్ విధులకు హాజరు కాలేదని సబల్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సర్జన్‌గా పనిచేస్తున్న విజయ్ కుమార్ తెలిపారు. వైద్యులు తమకు కేటాయించిన కేంద్రాలలో బాధ్యతలు స్వీకరించడానికి ముందు సివిల్ సర్జన్ కార్యాలయంలో నివేదించాలని ఆయన పేర్కొన్నారు.


More Telugu News