Telugu Techie: అమెరికాలో విషాదం.. పెళ్లి పీటలు ఎక్కాల్సిన తెలుగు యువకుడు గుండెపోటుతో మృతి

ఉన్నత చదువులు చదివి, అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదించి, మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు గుండెపోటుతో మరణించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో విషాదాన్ని నింపింది. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గోశిక యశ్వంత్ కుమార్ (33) అమెరికాలోని డాలస్‌లో సోమవారం గుండెపోటుతో చ‌నిపోయాడు.

వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్‌కు చెందిన గోశిక వెంకటేశం, గాయత్రీ దంపతులకు నలుగురు కుమారులు. వీరిలో యశ్వంత్ రెండో కుమారుడు. గత కొంతకాలంగా డాలస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యశ్వంత్, సోమవారం నిద్రలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. ఉదయం ఎంతకీ లేవకపోవడంతో గమనించిన స్నేహితులు.. మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే.. యశ్వంత్‌కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న వివాహానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. పెళ్లి పనుల కోసం మరికొద్ది రోజుల్లోనే స్వగ్రామానికి వచ్చేందుకు యశ్వంత్ సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

పెళ్లికొడుకుగా చూడాలనుకున్న బిడ్డను విగతజీవిగా చూడాల్సి రావడం ఆ తల్లిదండ్రుల గుండెలను పిండేస్తోంది. చేతికొచ్చిన కొడుకు అకాల మరణంతో చౌటుప్పల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, యశ్వంత్ మృతదేహాన్ని గురువారం నాటికి చౌటుప్పల్‌కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Telugu Techie
Goshika Yashwanth Kumar
Yadadri Bhuvanagiri
Choutuppal
Telugu youth
Heart attack
Dallas
Software engineer
USA
Marriage

More Telugu News