Ram Prasad Reddy: జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మార్చడంపై కన్నీటిపర్యంతమైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని మార్చి, అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను చేర్చే ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.

సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రాగానే మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తన నియోజకవర్గ కేంద్రం ప్రాధాన్యం కోల్పోతుందనే ఆందోళనతో ఆయన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి రాంప్రసాద్ రెడ్డిని స్వయంగా ఓదార్చారు.

రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను, పరిపాలనాపరమైన సవాళ్లను సీఎం ఆయనకు వివరించారు. అదే సమయంలో, రాయచోటి అభివృద్ధి విషయంలో ఎలాంటి ఆందోళన వద్దని భరోసా ఇచ్చారు. "రాయచోటి అభివృద్ధి బాధ్యతను నేను ప్రత్యేకంగా చూసుకుంటాను" అని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది.

ప్రస్తుతం రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. క్యాబినెట్ సమావేశంలో చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
Ram Prasad Reddy
Andhra Pradesh
Rayachoti
Madanapalle
Annamayya district
Chandrababu Naidu
district reorganization
cabinet meeting

More Telugu News