అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్... బీఆర్ఎస్ లో ఉత్సాహం

  • రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న కేసీఆర్
  • హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత
  • పాలమూరు-రంగారెడ్డి పథకంపై పోరాటానికి సిద్ధం కావాలని నేతలకు పిలుపు
  • ప్రభుత్వ ఎజెండాను బట్టి వ్యూహం రచించాలని పార్టీ నేతలకు సూచన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హాజరుకానున్నారు. రేపటి (డిసెంబరు 29) నుంచి జరగనున్న ఈ సమావేశాలకు తాను హాజరవుతున్నట్లు పార్టీ నేతలతో కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసానికి చేరుకున్నారు.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఏ ఎజెండాతో ముందుకు వస్తుందో గమనించి, దానికి అనుగుణంగా దీటుగా స్పందించాలని సూచించారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీ లోపల, బయట బలమైన పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

కాగా, అసెంబ్లీ సమావేశాల కోసం కేసీఆర్ హైదరాబాద్‌కు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ మీడియా సమావేశంలో తీవ్ర విమర్శలు చేయగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతేస్థాయిలో బదులిచ్చారు. ఈ మాటల యుద్ధం తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ఇవి అత్యంత ఆసక్తికరంగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీ చర్చలు, ఆరోపణలతో సభ దద్దరిల్లనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


More Telugu News