రేణుక, దీప్తి దెబ్బకు శ్రీలంక విలవిల.. భారత్ ముందు ఈజీ టార్గెట్

  • భారత్, శ్రీలంక మధ్య మూడో టీ20 మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు
  • 4 వికెట్లతో శ్రీలంకను దెబ్బతీసిన రేణుకా సింగ్
  • మూడు వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ
  • నిర్ణీత 20 ఓవర్లలో 112 పరుగులకే పరిమితమైన లంక
  • స్వల్ప లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడుతున్న షఫాలీ వర్మ
శ్రీలంక మహిళల జట్టుతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్, స్పిన్నర్ దీప్తి శర్మ ధాటికి లంక బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేయగలిగింది.

తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆరంభం నుంచే లంక బ్యాటర్లను కట్టడి చేశారు. లంక ఇన్నింగ్స్‌లో ఇమేషా దులని (27), హసిని పెరీరా (25), కవిషా దిల్హారి (20) మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో శ్రీలంక స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4 ఓవర్లలో కేవలం 21 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి లంక బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చింది. మరోవైపు దీప్తి శర్మ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. వీరిద్దరే లంక వికెట్లన్నింటినీ పంచుకోవడం గమనార్హం.

అనంతరం 113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్ స్మృతి మంధాన (1) త్వరగానే ఔటైనా, మరో ఓపెనర్ షఫాలీ వర్మ (25*) దూకుడుగా ఆడుతోంది. తాజా సమాచారం అందేసరికి భారత్ 3.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 86 పరుగులు చేయాల్సి ఉంది.


More Telugu News