కోహ్లీ ఆటను చూసేందుకు చెట్లు, కంటైనర్లు ఎక్కిన అభిమానులు

  • విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా నిన్న ఢిల్లీ, ఆంధ్రా మ్యాచ్
  • కోహ్లీ ఆటను చూసేందుకు ప్రమాదకర రీతిలో చెట్లు ఎక్కిన అభిమానులు
  • చెట్టు పైకి ఎక్కి వీడియో రికార్డు చేసిన ఒక అభిమాని
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటను వీక్షించేందుకు అభిమానులు చెట్లు ఎక్కారు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బెంగళూరు వేదికగా ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు కోహ్లీ 131 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కాకపోవడంతో కొందరు అభిమానులు ప్రమాదకర రీతిలో వేదిక చుట్టుపక్కల ఉన్న చెట్లపైకి ఎక్కి కోహ్లీ ఆటను తిలకించారు.

భద్రతా కారణాలను చూపుతూ కర్ణాటక ప్రభుత్వం ఎం. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించడానికి అనుమతి నిరాకరించింది. దీంతో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్‌లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు మార్చింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానం గ్రౌండ్ 1 గేట్లను తెరవకుండానే బీసీసీఐ ఈ మ్యాచ్‌ను నిర్వహించడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

దీంతో పలువురు కోహ్లీ అభిమానులు సమీపంలోని చెట్లు ఎక్కి మ్యాచ్‌ను వీక్షించారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు. ఎంతో దూరం నుంచి వచ్చిన వారు తమ అభిమాన ఆటగాడు కోహ్లీ మ్యాచ్‌ను ఎలాగైనా చూడాలనే తపనతో చెట్లు ఎక్కారు. మరికొంతమంది అక్కడే ఆగి ఉన్న కంటైనర్ల పైకి ఎక్కి మ్యాచ్ చూశారు. ఒక అభిమాని అయితే చెట్టు పైనుంచి మ్యాచ్‌ను వీడియో తీశాడు.


More Telugu News