ఏపీ హైకోర్టులో టీటీడీకి భారీ ఊరట

  • స్వర హోటల్‌కు భూ కేటాయింపుపై హైకోర్టులో పిల్ 
  • స్వర హోటల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం చట్ట విరుద్దమన్న పిటిషనర్  
  • భూమార్పిడి ఒప్పందాన్ని రద్దు చేయలేమన్న ఉన్నత న్యాయస్థానం
  • పిల్ ను కొట్టేసిన హైకోర్టు
తిరుపతి మండలం పేరూరు గ్రామ పరిధిలో టీటీడీకి చెందిన భూమిని పరస్పర భూమార్పిడి విధానంలో పర్యాటక శాఖకు కేటాయించి, అనంతరం దానిని ఒబెరాయ్‌ గ్రూప్‌కు చెందిన ‘స్వర’ హోటల్‌ నిర్మాణానికి ఇచ్చిన వ్యవహారంలో హైకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ మేరకు దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్‌) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది.

టీటీడీ - పర్యాటక శాఖ మధ్య జరిగిన భూమార్పిడిని రద్దు చేయాలని, స్వర హోటల్స్‌కు భూమి కేటాయింపుపై జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ తిరు క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ టీటీడీ నుంచి పర్యాటక శాఖ తీసుకున్న భూమిలో స్వర్ణ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, భక్తుల కోసం చేపట్టాల్సిన ప్రాజెక్ట్‌ను టీటీడీ వేరే ప్రాంతానికి మార్చిందన్న కారణంతో మాత్రమే భూమార్పిడి ఒప్పందాన్ని రద్దు చేయలేమని స్పష్టం చేస్తూ పిల్‌ను తోసిపుచ్చింది. దీంతో టీటీడీకి హైకోర్టులో భారీ ఊరట లభించినట్లయింది. 


More Telugu News