Kannababu: విమర్శలు ఎదురైనప్పుడల్లా లడ్డూ అంశాన్ని వాడుకుంటున్నారు: కన్నబాబు

Kannababu Accuses Chandrababu of Laddu Issue Diversion
  • సిట్ నివేదికలో ఎలాంటి ఆధారాలు లేవని తేలినా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కన్నబాబు
  • రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం
  • తమ హయాంలోనే 3,000 ఆలయాలు నిర్మించామని వెల్లడి
  • తప్పుడు ఆరోపణలపై ప్రశ్నిస్తే దాడులు, అక్రమ కేసులు పెడుతున్నారని వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే తిరుపతి లడ్డూ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా ఆరోపించారు. ఆదివారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా కీలక హామీలను నెరవేర్చలేక, విమర్శలు ఎదురైనప్పుడల్లా లడ్డూ అంశాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు.

రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ, హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. లడ్డూలో జంతు కొవ్వు కలిపారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిట్ బృందం విచారణ జరిపి, ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసినా అధికార కూటమి తప్పుడు ప్రచారం ఆపడం లేదని మండిపడ్డారు. వివాదానికి కారణమైన నెయ్యి నమూనాలను తమ కూటమి అధికారంలోకి వచ్చాకే సేకరించారని, అసలు బోలే బాబా డెయిరీకి అనుమతులు ఇచ్చిందే చంద్రబాబు గత ప్రభుత్వమని గుర్తుచేశారు.

సిట్ నివేదికతో అబద్ధాలు బయటపడటంతో, ఇప్పుడు లడ్డూ తయారీలో ‘టాయిలెట్ క్లీనింగ్ కెమికల్స్’ వాడారంటూ చంద్రబాబు కొత్త ఆరోపణలు చేస్తున్నారని కన్నబాబు అన్నారు. జగన్‌ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకోవడానికే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో దాదాపు 3,000 ఆలయాలను నిర్మించామని, తిరుమల ఏడు కొండలను కాపాడామని తెలిపారు.

తప్పుడు ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని కోరిన తమ పార్టీ నేతలపై దాడులు చేస్తూ, అక్రమ కేసులు బనాయిస్తున్నారని కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసుల సాయంతో ‘జంగిల్ రాజ్’ నడుస్తోందని ఆయన విమర్శించారు.
Kannababu
Kurasala Kannababu
Chandrababu
Tirupati Laddu
Andhra Pradesh Politics
YSRCP
TDP
Laddu Controversy
Tirumala
Political Allegations

More Telugu News