విజయ్ హజారేలో హిట్‌మ్యాన్ విధ్వంసం.. గంభీర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్‌!

  • విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగిన రోహిత్ శర్మ
  • సిక్కింపై 94 బంతుల్లో 155 పరుగుల మెరుపు ఇన్నింగ్స్
  • సెలక్టర్ ఆర్పీ సింగ్‌ను చూసి గంభీర్ పేరుతో అభిమానుల నినాదాలు
  • రోహిత్ ఆట చూసేందుకు స్టేడియానికి పోటెత్తిన వేలాది మంది ఫ్యాన్స్
భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తనదైన శైలిలో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా నిన్న‌ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 94 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్సర్లతో 155 పరుగులు చేసి అభిమానులకు కనువిందు చేశాడు.

ఈ మ్యాచ్‌లో సిక్కిం నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. రోహిత్ వీరవిహారంతో ఆ జట్టు కేవలం 30.3 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరో 117 బంతులు మిగిలి ఉండగానే ముంబై లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం.

స్టేడియంలో ఆసక్తికర ఘటన
ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బీసీసీఐ సెలక్టర్ ఆర్పీ సింగ్‌ను గ్యాలరీలో చూసిన అభిమానులు, గౌతమ్ గంభీర్‌ను ఉద్దేశించి నినాదాలు చేశారు. "గంభీర్ ఎక్కడున్నాడు? చూస్తున్నావా లేదా?" అంటూ గట్టిగా అరిచారు.

రోహిత్ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు వారాంతం కానప్పటికీ, దాదాపు 20,000 మందికి పైగా అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. ఉద్యోగులు, విద్యార్థులు తమ పనులను, క్లాసులను పక్కనపెట్టి హిట్‌మ్యాన్ బ్యాటింగ్ చూసేందుకు వచ్చారు. "ముంబై కా రాజా.. రోహిత్ శర్మ" నినాదాలతో స్టేడియం మార్మోగింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సిక్కిం జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 236 పరుగులు చేసింది. ఆ జట్టులో ఆశిష్ థాపా 79 ప‌రుగుల‌తో రాణించాడు.


More Telugu News