ఏపీపై మల్లారెడ్డి ఫోకస్.. టీడీపీ ఎమ్మెల్యేతో భేటీ.. బొబ్బిలి పర్యటన వెనుక అసలు కారణమిదేనా?

  • విజయనగరం జిల్లా బొబ్బిలి కోటను సందర్శించిన మల్లారెడ్డి
  • స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బేబినాయనతో ప్రత్యేకంగా సమావేశం
  • తాండ్రపాపారాయుడి చారిత్రక కత్తితో ఫొటోలు
  • ఏపీలో విద్యాసంస్థల విస్తరణపై దృష్టి సారించినట్లు సమాచారం
తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. విజయనగరం జిల్లాలోని చారిత్రక బొబ్బిలి కోటను సందర్శించిన ఆయన, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బేబినాయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కలిసి కోటలోని మ్యూజియంను సందర్శించి, బొబ్బిలి రాజుల వంశవృక్షాన్ని, వాడిన వస్తువులను పరిశీలించారు.

బొబ్బిలి రాజుల చరిత్ర ఎంతో గొప్పదని, రెండు శతాబ్దాల నాటి వస్తువులను జాగ్రత్తగా భద్రపరచడం అభినందనీయమని మల్లారెడ్డి ప్రశంసించారు. పర్యటనలో భాగంగా ఆయన తాండ్రపాపారాయుడు ఉపయోగించిన కత్తిని చేతబట్టి ఫొటోలకు పోజులిచ్చారు. కోట విశేషాలను వివరించిన ఎమ్మెల్యే బేబినాయనకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సాధారణ పర్యటనలా కనిపించినా, దీని వెనుక విద్యాసంస్థల విస్తరణ ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. బొబ్బిలిలోని ఓ విద్యాసంస్థ ప్రాంగణంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న స్థానిక యాజమాన్యం విన్నపం మేరకే మల్లారెడ్డి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పలు డీమ్డ్ యూనివర్సిటీలు, మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు నడుపుతున్న ఆయన, ఏపీలోనూ విద్యాసంస్థలను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవలే విశాఖపట్నం, తిరుపతిలో కొన్ని కాలేజీలను కొనుగోలు చేసినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు.

కాగా, మల్లారెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీతోనే ప్రారంభించారు. 2014లో మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన ఆయన, ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో బీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు.


More Telugu News