Nagababu: ఎన్నికల్లో పోటీ చేయడంపై నాగబాబు స్పందన

Nagababu Clarifies on Contesting Elections
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగేంద్రబాబు (నాగబాబు) ప్రత్యక్ష రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు. తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని, పార్టీ కార్యకర్తగా ఉండటంలోనే ఎక్కువ సంతృప్తి ఉందని స్పష్టం చేశారు. ఇటీవల ఉత్తరాంధ్రపై దృష్టి సారించిన ఆయన, శ్రీకాకుళంలో పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

గత కొంతకాలంగా నాగబాబు శ్రీకాకుళంలో తరచూ పర్యటిస్తుండటంతో, ఆయన అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఈ ఊహాగానాలకు తెరదించేందుకే ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. "నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే గత ఎన్నికల్లోనే చేసేవాడిని. వచ్చే ఎన్నికల వరకు ఎందుకు ఆగాలి? ఐదారేళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఎలా చెబుతాం?" అని నాగబాబు అన్నారు. జనసేన ప్రధాన కార్యదర్శి కంటే పార్టీ కార్యకర్తగా పిలిపించుకోవడమే తనకు ఇష్టమని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం నాగబాబు ఎమ్మెల్సీగా సేవలు అందిస్తున్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించినా, పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి దక్కిన విషయం తెలిసిందే. శ్రీకాకుళంలో ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో, నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం కూటమిలో అనవసర ఇబ్బందులకు దారితీయవచ్చని భావించిన ఆయన, ముందుగానే తన వైఖరిని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనతో ఉత్తరాంధ్రలో ఆయన పోటీపై వస్తున్న వదంతులకు తెరపడినట్లయింది.
Nagababu
Janasena Party
Srikakulam
Andhra Pradesh Elections
MLC Nagababu
Rammohan Naidu
Anakapalli
Political News

More Telugu News