పాకిస్థాన్‌లో మునీర్ ప్రతీకారం.. మాజీ ఐఎస్ఐ చీఫ్‌కు 14 ఏళ్ల జైలు!

  • ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడికి కఠిన శిక్ష
  • రాజకీయ జోక్యం, అధికార దుర్వినియోగం ఆరోపణలు
  • పాక్ ఆర్మీలో అంతర్గత పోరుకు అద్దం పడుతున్న పరిణామాలు
పాకిస్థాన్‌లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఐఎస్ఐ మాజీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌కు సైనిక కోర్టు 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అధికార దుర్వినియోగం, రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలపై ఆయనను దోషిగా తేల్చింది. ఈ పరిణామం వెనుక ప్రస్తుత ఆర్మీ చీఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (సీడీఎఫ్) అసిమ్ మునీర్ ప్రతీకార చర్యలే కారణమనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

పాక్ సైనిక చట్టం కింద ఫైజ్ హమీద్‌పై సుమారు 15 నెలల పాటు విచారణ జరిగింది. కోర్టు మార్షల్ నిర్వహించి, ఈరోజు తుది తీర్పు వెలువరించారు. రాజకీయ జోక్యంతో పాటు అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. అయితే, ఆయన చర్యల వల్ల సైన్యానికి ఎలాంటి నష్టం వాటిల్లిందనే వివరాలను మాత్రం ప్రభుత్వం గానీ, సైన్యం గానీ బయటపెట్టలేదు. ఈ తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశం హమీద్‌కు కల్పించారు.

ఫైజ్ హమీద్ కు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఇమ్రాన్ హయాంలోనే ఆయన ఐఎస్ఐ చీఫ్‌గా నియమితులయ్యారు. వాస్తవానికి, 2019లో అప్పటి ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్న అసిమ్ మునీర్‌ను ఆ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో హమీద్‌ను ఇమ్రాన్ ప్రభుత్వం నియమించింది. 

కాలక్రమేణా రాజకీయ సమీకరణాలు మారడంతో ఇమ్రాన్ ఖాన్ అధికారం కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన షహబాజ్ షరీఫ్ ప్రభుత్వ హయాంలో అసిమ్ మునీర్ 2022లో ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయనకు ఫీల్డ్ మార్షల్ హోదాతో పాటు సీడీఎఫ్‌గా అదనపు అధికారాలు కట్టబెట్టారు. దీంతో దేశ అణు కార్యక్రమాలపై పూర్తి నియంత్రణ ఆయన చేతికి వచ్చింది. ఈ అధికారంతోనే మునీర్ తన రాజకీయ ప్రత్యర్థులైన ఇమ్రాన్ ఖాన్, ఫైజ్ హమీద్‌లపై కక్ష సాధిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


More Telugu News