కోహ్లీ సెంచరీ.. అనుష్క స్పెషల్ పోస్ట్!

  • దక్షిణాఫ్రికాతో వన్డేలో విరాట్ కోహ్లీ శతకం
  • భర్త ఘనతపై సోషల్ మీడియాలో అనుష్క హర్షం
  • సెంచరీ తర్వాత మెడలోని ఉంగరాన్ని ముద్దాడిన విరాట్
  • ఈ నెల‌ 11న విరుష్క జంట 8వ వివాహ వార్షికోత్సవం
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన అద్భుతమైన ఫామ్‌ను కొన‌సాగించాడు. దక్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న రెండో వన్డేలో అద్భుత శతకంతో చెలరేగాడు. ఈ సిరీస్‌లో ఇది అతనికి వరుస‌గా రెండో సెంచరీ కావడం విశేషం. కోహ్లీ సెంచరీ సాధించగానే, అతని భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సెంచరీ తర్వాత మైదానంలో నిల్చున్న విరాట్ ఫొటోను షేర్ చేసి, దానికి ఒక హార్ట్ ఎమోజీని జోడించారు.

ఇక, శతకం పూర్తి కాగానే విరాట్ కోహ్లీ చేసిన ఒక పని అభిమానుల హృదయాలను గెలుచుకుంది. అతను వెంటనే తన మెడలోని చైన్‌ను బయటకు తీసి, దానికి ఉన్న తన పెళ్లి ఉంగరాన్ని ముద్దాడాడు. తన విజయం వెనుక ఉన్న భార్య అనుష్కకు ఈ రకంగా కృతజ్ఞతలు తెలిపాడని అభిమానులు సంబ‌ర ప‌డిపోతున్నారు. ఈ దృశ్యంపై ఒక అభిమాని సోషల్ మీడియాలో స్పందిస్తూ, "విరాట్ సెంచరీ పూర్తి చేసి, అనుష్క ఉంగరం ఉన్న తన లాకెట్‌ను ముద్దాడాడు. ఆ తర్వాత తండ్రి ఆశీస్సుల కోసం ఆకాశం వైపు చూశాడు. ఇది క్రికెట్‌కు మించిన క్షణం" అని పోస్ట్ చేశాడు.

కోహ్లీ ఇలా భార్యపై తన ప్రేమను బహిరంగంగా చూపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలా మ్యాచ్‌లలో విజయం సాధించినప్పుడు అతను తన ఉంగరాన్ని ముద్దాడటం లేదా అనుష్క వైపు చూడటం వంటివి చేశాడు.

విరాట్, అనుష్క జంట ఈ నెల‌ 11న తమ 8వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నారు. 2017లో ఇటలీలో వివాహం చేసుకున్న ఈ దంపతులకు 2021లో కుమార్తె వామిక, 2024 ఫిబ్రవరిలో కుమారుడు అకాయ్ జన్మించారు.


More Telugu News