యాషెస్ పిచ్ వివాదం: ఐసీసీ రేటింగ్‌ను తప్పుబట్టిన గవాస్కర్

  • రెండ్రోజుల్లోనే ముగిసిన పెర్త్ యాషెస్ టెస్ట్
  • పిచ్‌కు ఐసీసీ 'వెరీ గుడ్' రేటింగ్
  • పిచ్‌ల రేటింగ్‌లో పక్షపాతంపై సునీల్ గవాస్కర్ ఫైర్
టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. క్రికెట్ పిచ్‌ల రేటింగ్ విధానంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య పెర్త్‌లో జరిగిన యాషెస్ టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడం, ఆ పిచ్‌కు ఐసీసీ 'వెరీ గుడ్' రేటింగ్ ఇవ్వడంపై ఆయన ఘాటుగా స్పందించారు. పేస్, బౌన్స్‌కు అనుకూలించే పిచ్‌లను గొప్పవిగా, స్పిన్‌కు అనుకూలించే ఉపఖండంలోని పిచ్‌లను నాసిరకమైనవిగా చూసే ద్వంద్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు.

2025-26 యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. అయినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ పిచ్‌కు అత్యుత్తమ రేటింగ్ అయిన 'వెరీ గుడ్' అని కితాబునిచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆడిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మాత్రం ఆ పిచ్ 'చెత్తగా' ఉందంటూ తీవ్ర విమర్శలు చేశాడు. తొలిరోజే 19 వికెట్లు పడటం, చాలా మంది ఆటగాళ్లు గాయపడటమే దీనికి నిదర్శనమని అన్నారు.

ఈ నేపథ్యంలో గవాస్కర్ తన అభిప్రాయాలను ఒక క్రీడా పత్రికలో రాసిన వ్యాసంలో పంచుకున్నారు. "పేస్, బౌన్స్‌తో ప్రాణాలకు ప్రమాదకరంగా ఉండే పిచ్‌లను ఎప్పుడూ చెడ్డవిగా చూడరు. అదే ఉపఖండంలో బంతి తిరిగితే మాత్రం దాన్ని అవమానంగా పరిగణిస్తారు. ఇది పాత క్రికెట్ శక్తుల కథనం" అని ఆయన మండిపడ్డారు. మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలె అనుభవజ్ఞుడని, ఆయన రేటింగ్‌ను గౌరవిస్తానని, కానీ మైదానంలో ఆడిన ఖవాజా అభిప్రాయాన్ని విస్మరించలేమని అన్నారు.

"పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై పరుగులు చేస్తేనే గొప్ప బ్యాటర్‌గా గుర్తిస్తారు. కానీ స్పిన్‌ను ఎదుర్కోవడానికి ఎక్కువ నైపుణ్యం, ఫుట్‌వర్క్ అవసరం. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై పరుగులు చేయలేని వారిని గొప్ప బ్యాటర్లుగా ఎలా పిలుస్తారు?" అని గవాస్కర్ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, రెండో యాషెస్ టెస్టు డిసెంబర్ 4 నుంచి బ్రిస్బేన్‌లో ప్రారంభం కానుంది. 


More Telugu News