అభిషేక్ శర్మ విధ్వంసం.. 32 బంతుల్లోనే సెంచరీ!

  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అభిషేక్ శర్మ విధ్వంసం
  • కేవలం 32 బంతుల్లోనే శతకం బాదిన పంజాబ్ ఓపెనర్
  • 12 బంతుల్లో హాఫ్ సెంచరీతో యువరాజ్ సింగ్ రికార్డు సమం
  • బెంగాల్‌పై 20 ఓవర్లలో 310 పరుగులు చేసిన పంజాబ్
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ అద్భుత ఫామ్‌ను ప్రదర్శించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్ వేదికగా బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, టీ20 ఫార్మాట్‌లో తనదైన ముద్ర వేశాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అభిషేక్... 52 బంతుల్లో 16 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 148 పరుగులు చేసి ఔరా అనిపించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టుకు అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, తన మెంటార్ యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై యువరాజ్ సరిగ్గా 12 బంతుల్లోనే అర్ధ శతకం సాధించిన విషయం తెలిసిందే. మరో ఓపెనర్ ప్రభుసిమ్రన్‌ సింగ్ (35 బంతుల్లో 70) కూడా రాణించడంతో, వీరిద్దరూ తొలి వికెట్‌కు 205 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

అభిషేక్ విధ్వంసానికి తోడు రమణ్‌దీప్‌ సింగ్‌ (15 బంతుల్లో 39), సన్విర్‌ సింగ్‌ (8 బంతుల్లో 22) చివరిలో మెరుపులు మెరిపించడంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు కాగా, ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో నాలుగో అత్యధిక స్కోరు. బెంగాల్ బౌలర్లలో ఆకాశ్ దీప్‌ రెండు వికెట్లు తీయగా, మహ్మద్ షమీ, ప్రదీప్త, సాక్షైమ్‌ తలో వికెట్ పడగొట్టారు.


More Telugu News