తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. ముగిసిన మొదటి విడత నామినేషన్లు

  • ఈరోజు సాయంత్రంతో ముగిసిన మొదటి విడత నామినేషన్ల గడువు
  • మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డుల్లో నామినేషన్ల స్వీకరణ
  • వచ్చే నెల 11న పోలింగ్, ఓట్ల లెక్కింపు
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల మొదటి దశకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ గడువు ఈరోజు సాయంత్రంతో ముగిసింది. మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలకు, 37,440 వార్డులకు నామినేషన్లు స్వీకరించారు. ఆదివారం నామినేషన్ల పరిశీలన ఉంటుందని, అదే రోజు చెల్లుబాటు అయిన నామినేషన్ల వివరాలు వెల్లడిస్తారని అధికారులు తెలిపారు. సోమవారం అప్పీలు స్వీకరణ, డిసెంబర్ 2న అప్పీళ్ల పరిష్కారం ఉంటుందని పేర్కొన్నారు.

డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తారు. వచ్చే నెల 11న పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక జరుగుతాయని అధికారులు తెలిపారు. రేపటి నుండి డిసెంబర్ 2 వరకు రెండవ విడత ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండవ విడతలో 193 మండలాల్లోని 4,333 పంచాయతీలకు, 38,350 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇదిలా ఉండగా, వికారాబాద్ తాండూరు మండలంలో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ రాత్రి 7 గంటలు దాటినా కొనసాగింది. పదుల సంఖ్యలో అభ్యర్థులు ఉండటంతో రాత్రి 9 గంటల వరకు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల గడువు ముగిసింది. ఆ సమయానికి క్యూలో ఉన్న అభ్యర్థులకు టోకెన్లు జారీ చేసి నామినేషన్ పత్రాల దాఖలుకు అనుమతిస్తున్నారు.

Telangana Panchayat Elections
Telangana elections
Panchayat elections
Gram panchayats
Telangana local body elections

More Telugu News