అమరావతి అంతులేని కథ.. చంద్రబాబుపై అంబటి రాంబాబు ఫైర్

  • అమరావతి భూసేకరణపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు
  • చంద్రబాబు అధికారంలోకి రాగానే భూముల ధరలు తగ్గాయన్న అంబటి
  • రాజధాని పేరుతో చంద్రబాబు దోచుకుంటున్నారని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విస్తరణ కోసం ప్రభుత్వం మరోసారి భూసేకరణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి కథ ఒక అంతులేని కథలా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో భూముల ధరలు పడిపోయాయని వ్యాఖ్యానించారు.

రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతూ దోచుకుంటున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఇప్పటికే రాజధాని కోసం రైతులు 35 వేల ఎకరాల భూములు త్యాగం చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 50 వేల ఎకరాలతో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మిస్తానని గతంలో చంద్రబాబు ప్రగల్భాలు పలికారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ భూసేకరణకు ఎందుకు సిద్ధమవుతున్నారని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వ నిర్ణయాల వల్ల అమరావతి రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంపై స్పష్టత ఇవ్వకుండా, పదేపదే భూసేకరణ అనడం రైతులను ఇబ్బందులకు గురి చేయడమేనని ఆయన అన్నారు. ప్రభుత్వ తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.


More Telugu News