పార్లమెంట్ సమావేశాలు.. జనసేన ఎంపీలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

  • జనసేన ఎంపీలు బాలశౌరి, ఉదయ శ్రీనివాస్‌తో పవన్ కల్యాణ్ భేటీ
  • రాష్ట్ర అంశాలపై పార్లమెంట్‌లో గట్టిగా గళం విప్పాలన్న పవన్ 
  • పోలవరం, అమరావతి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని సూచన
  • కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్ర సమస్యలు వివరించాలని ఆదేశం
డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ ఎంపీలకు కీలక దిశానిర్దేశం చేశారు. అమరావతిలో లోక్‌సభ సభ్యులు బాలశౌరి, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
 
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్‌లో గట్టిగా గళం విప్పాలని సూచించారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన చర్చల్లో చురుగ్గా పాల్గొనేందుకు ముందస్తుగా సిద్ధం కావాలని ఎంపీలకు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు సంబంధిత కేంద్ర మంత్రులతో సమావేశమై, వివరణాత్మక నివేదికలు అందించాలని స్పష్టం చేశారు.
 
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న సహకారం చాలా కీలకమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు కేంద్ర పథకాల ద్వారా రావాల్సిన నిధులపై రాష్ట్ర అధికారులతో సమీక్షించి, ఆ వివరాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. 

Pawan Kalyan
Janasena
Parliament Winter Session
Andhra Pradesh
Amaravati
Polavaram Project
Balashouri
Tangella Uday Srinivas
Central Funds

More Telugu News