ధర్మేంద్ర-హేమల ప్రేమకథలో ఈ ఆసక్తికర విషయం మీకు తెలుసా?

  • హేమ మాలిని డెలివరీ కోసం ఏకంగా నర్సింగ్ హోమ్‌నే బుక్ చేసిన ధర్మేంద్ర
  • ఆమె గోప్యతకు భంగం కలగకూడదనే ఈ నిర్ణయం
  • నర్సింగ్ హోమ్‌లోని 100 గదులను అద్దెకు తీసుకున్న వైనం
  • మొదటి భార్య ఉండగానే హేమ మాలినిని వివాహం చేసుకున్న ధర్మేంద్ర
బాలీవుడ్ ‘డ్రీమ్ గర్ల్’ హేమ మాలినిపై దిగ్గజ నటుడు ధర్మేంద్రకు ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఒక సంఘటన ఎప్పుడూ ఉదాహరణగా నిలుస్తుంది. తన భార్య ప్రసవ సమయంలో ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, గోప్యతకు భంగం వాటిల్లకూడదని ఏకంగా ఒక నర్సింగ్ హోమ్‌నే బుక్ చేశారు. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.

1981లో హేమ మాలిని తన మొదటి కుమార్తె ఇషా డియోల్‌కు జన్మనిచ్చారు. ఆ సమయంలో ఆమె డెలివరీ కోసం ముంబైలోని ఒక నర్సింగ్ హోమ్‌లోని 100 గదులనూ ధర్మేంద్ర బుక్ చేశారని హేమ సన్నిహితురాలు ఒకరు గతంలో వెల్లడించారు. ‘హేమ గర్భవతి అనే విషయం బయటకు తెలియకూడదని, ఆమెకు పూర్తి ప్రైవసీ ఉండాలనే ఉద్దేశంతో ధరమ్ జీ ఈ ఏర్పాటు చేశారు’ అని ఆమె గుర్తుచేసుకున్నారు.

1970లలో సినిమాల్లో కలిసి నటిస్తూ ప్రేమలో పడిన ధర్మేంద్ర-హేమ మాలిని జంట, 1980లో వివాహం చేసుకున్నారు. అప్పటికే ధర్మేంద్రకు ప్రకాష్ కౌర్‌తో వివాహమై సన్నీ డియోల్, బాబీ డియోల్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం అప్పట్లో చట్టరీత్యా సాధ్యం కాకపోవడంతో, ఆయన ఇస్లాం మతం స్వీకరించి దిలావర్ ఖాన్‌గా పేరు మార్చుకుని హేమను వివాహం చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ధర్మేంద్ర-హేమ మాలిని దంపతులకు ఇషా డియోల్, ఆహాన డియోల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ధర్మేంద్రకు మొదటి భార్య ప్రకాష్ కౌర్ ద్వారా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.. ఇలా మొత్తం ఆరుగురు సంతానం.


More Telugu News