కొడుకు ప్రదర్శన కోసం యూట్యూబ్ చూస్తే.. మరణవార్త కనిపించింది!

Namansh Syal Father Saw Sons Death News on YouTube
షార్ట్స్‌లో చూడండి
దుబాయ్‌లో జరిగిన తేజస్ యుద్ధ విమాన ప్రమాదంలో భారత వైమానిక దళ (ఐఏఎఫ్) పైలట్ వింగ్ కమాండర్ నమాన్ష్ శ్యాల్ మరణించారు. అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే.. తన కుమారుడి మరణవార్తను ఆయన తండ్రి యూట్యూబ్ ద్వారా తెలుసుకోవాల్సి వచ్చింది. దుబాయ్ ఎయిర్ షోలో నమాన్ష్ నడుపుతున్న తేజస్ విమానం శుక్రవారం సాయంత్రం కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో పైలట్ మృతి చెందినట్లు ఐఏఎఫ్ ధృవీకరించింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాకు చెందిన రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ జగన్ నాథ్ శ్యాల్.. తన కుమారుడు చెప్పిన మాట ప్రకారం ఎయిర్ షోలో అతడి ప్రదర్శనను చూడటానికి యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు. ఆ సమయంలోనే విమానం కూలిపోయిన వార్త ఆయన కంటపడింది. వెంటనే ఆయన తన కోడలికి ఫోన్ చేశారు. ఆమె కూడా ఎయిర్‌ఫోర్స్‌లో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్నారు. కొద్దిసేపటికే వైమానిక దళ అధికారులు వారి ఇంటికి రావడంతో, తన కొడుకుకు ఏదో తీవ్రమైన ప్రమాదం జరిగిందని ఆయన గ్రహించారు.

34 ఏళ్ల నమాన్ష్ శ్యాల్ 2009లో ఎన్‌డీఏ పరీక్షలో ఉత్తీర్ణులై రక్షణ దళాల్లో చేరారు. ఆయన భార్య శిక్షణ నిమిత్తం కోల్‌కతాలో ఉండటంతో, వారి ఏడేళ్ల కుమార్తె ఆర్యను చూసుకోవడానికి తల్లిదండ్రులు జగన్ నాథ్, వీణా శ్యాల్ హిమాచల్‌లోని తమ స్వగ్రామం నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు వచ్చారు. ఈ వార్తతో నమాన్ష్ తల్లి తీవ్ర దిగ్భ్రాంతికి గురై మాట్లాడలేని స్థితిలో ఉన్నారు.

‘కాంగ్రా వీరపుత్రుడు’ నమాన్ష్ శ్యాల్ మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర సంతాపం తెలిపారు. దేశం ఒక ధైర్యవంతుడైన పైలట్‌ను కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నమాన్ష్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి రెండు రోజులు పట్టవచ్చని అధికారులు తెలిపినట్లు ఆయన తండ్రి పేర్కొన్నారు.
Go Back to Shorts
Namansh Syal
IAF pilot
Tejas fighter jet
Dubai airshow crash
Indian Air Force
Sukhu
Himachal Pradesh
defence forces
air force wing commander

More Telugu News