ఆదర్శ వివాహం.. గుడిలో ఒక్కటైన యువ ఐఏఎస్ జంట

  • నిరాడంబరంగా ఒక్కటైన ఇద్దరు ఐఏఎస్ అధికారులు
  • పాడేరు ఐటీడీఏ పీవో శ్రీ పూజ, మేఘాలయ జేసీ ఆదిత్యవర్మ వివాహం
  • కైలాసగిరి శివాలయంలో దండలు మార్చుకున్న జంట
  • రిజిస్ట్రార్ కార్యాలయంలో సంతకాలతో చట్టబద్ధంగా ఒక్కటైన వైనం
ఆర్భాటాలు, అట్టహాసాలకు దూరంగా ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులు ఎంతో నిరాడంబరంగా వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న టి.శ్రీ పూజ, మేఘాలయలో దాదెంగ్రి జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆదిత్యవర్మ శుక్రవారం విశాఖపట్నంలో ఒక్కటయ్యారు.

విశాఖలోని కైలాసగిరిపై ఉన్న శివాలయంలో ఇరువురూ దండలు మార్చుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమానికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వీరిద్దరూ నేరుగా వన్‌టౌన్‌లోని జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేసి తమ వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేసుకున్నారు. విశాఖపట్నం డీఐజీ బాలకృష్ణ దగ్గరుండి ఈ వివాహ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు.

వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు బ్యాచ్‌లకు చెందిన ఈ ఇద్దరు అధికారులది పెద్దలు కుదిర్చిన వివాహమని వధువు తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. భారీ ఖర్చుతో పెళ్లిళ్లు జరుగుతున్న ఈ రోజుల్లో ఉన్నత హోదాలో ఉన్న అధికారులు ఇలా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

IAS Officers Marriage
Sri Pooja
IAS Sri Pooja
Aditya Varma
Visakhapatnam
Kailasagiri
Alluri Sitarama Raju district
Meghalaya
Ideal marriage
Simple wedding

More Telugu News