కేటీఆర్‌కు పచ్చకామెర్లు సోకాయి: చామల కిరణ్ కుమార్ రెడ్డి

  • రేవంత్ కుటుంబాన్ని కేటీఆర్ విమర్శించడంపై చామల ఆగ్రహం
  • బీఆర్ఎస్ హయాంలో సాగింది ఫాం హౌస్ పాలనేనని ఆరోపణ
  • ఎన్నికల్లో ఓడినా కేటీఆర్‌కు బుద్ధి రాలేదని విమర్శ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ప్రస్తుతం కేటీఆర్ పరిస్థితి కూడా అలాగే ఉంది" అని ఆయన ఎద్దేవా చేశారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ తీరుపై ఈ మేరకు ఆయన మండిపడ్డారు.

బీఆర్ఎస్ హయాంలో ఫాం హౌస్ పాలన తప్ప, ప్రజల కోసం పాలన చేయలేదని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని నిందించడం తప్ప కేటీఆర్‌కు మరో మార్గం కనిపించడం లేదని విమర్శించారు. అసలు రేవంత్ రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. "కేసీఆర్ కుటుంబంలో మాదిరి రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరూ పదవుల్లో లేరు కదా?" అని నిలదీశారు.

బీఆర్ఎస్ నేతలు ప్రజలకు మంచి చేయలేదని, ఇప్పుడు తాము చేస్తుంటే అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓడించినా కేటీఆర్‌కు ఇంకా బుద్ధి రాలేదని, ఆయన తీరు మారలేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.


More Telugu News