వేశ్య పాత్రను ఒప్పుకోవడానికి కారణం ఇదే: బిందు మాధవి

  • ‘దండోరా’ చిత్రంలో వేశ్య పాత్రలో బిందు మాధవి
  • ఇది కథను మలుపు తిప్పే కీలక పాత్ర అని వ్యాఖ్య 
  • మొదట వద్దనుకున్నా, కథ విన్నాక నిర్ణయం మార్చుకున్నానని వెల్లడి  
‘అవకాయ బిర్యానీ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై, ఆ తర్వాత బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి బిందు మాధవి, తన తదుపరి చిత్రంలో ఓ సవాలుతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. ఆమె నటిస్తున్న ‘దండోరా’ సినిమాలో వేశ్య పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ పాత్రను అంగీకరించడానికి గల కారణాలను వెల్లడించారు.

మురళీకాంత్ దర్శకత్వంలో, లైక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో, పాత ఆచారాలు, హాస్యం, భావోద్వేగాల కలబోతగా ‘దండోరా’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవి కృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ పాత్ర గురించి బిందు మాధవి మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు కథ చెప్పడానికి వచ్చినప్పుడు, సినిమా అప్పటికే సగం పూర్తయిందని చెప్పారు. దాంతో నా పాత్ర చిన్నదేమో అని మొదట వద్దనుకున్నాను. కానీ కథ విన్న తర్వాత నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. నా పాత్ర ఎంట్రీతోనే సినిమా మొత్తం మలుపు తిరుగుతుందని అర్థమైంది. కథలో అంతటి ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో వెంటనే అంగీకరించాను. ఆ క్షణంలోనే ఈ పాత్ర నాదే అని ఫిక్స్ అయ్యాను’’ అని వివరించారు. సాధారణంగా ఇలాంటి పాత్రలు చేయడానికి చాలా ధైర్యం కావాలని, అయితే కథలో ఉన్న బలం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని బిందు మాధవి స్పష్టం చేశారు. 


More Telugu News