హిడ్మా కోరితే నేనే సరెండర్ చేయించేవాడిని: కూనంనేని ఆవేదన

  • హిడ్మాను చంపి ఎన్‌కౌంటర్ అంటున్నారు... ఎమ్మెల్యే కూనంనేని సంచలన ఆరోపణ
  • మావోయిస్టు ఎన్‌కౌంటర్లపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడి
  • దండకారణ్యంలోని ఖనిజాల కోసమే ఈ హత్యలు అని ఆరోపణ
మావోయిస్టు నేత హిడ్మాను చంపి, దానిని ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని తెలంగాణ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన ఆరోపణలు చేశారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు.

"హిడ్మా కోరి ఉంటే నేనే స్వయంగా డీజీపీకి సరెండర్ చేయించేవాడిని. కానీ అతన్ని చంపేసి ఎన్‌కౌంటర్ అంటున్నారు" అని కూనంనేని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టుల పక్షాన న్యాయపోరాటం చేస్తామని, ఈ అంశంపై చర్చించేందుకు గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి సమస్యలు తెలుసుకోవాలి కానీ, ఇలా చంపడం సరికాదని విమర్శించారు. 2026 మార్చి నాటికి మావోయిజం లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడాన్ని తప్పుబట్టారు. "ఇదేమైనా యుద్ధమా?" అని ప్రశ్నించారు. దండకారణ్యంలోని విలువైన ఖనిజ సంపద కోసమే ప్రభుత్వం మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని హతమారుస్తోందని ఆయన ఆరోపించారు. ఏకపక్ష కాల్పులను కూడా బండి సంజయ్ ఎన్‌కౌంటర్‌గా చెప్పడం దారుణమని మండిపడ్డారు. హింసను వీడి, శాంతియుత పరిష్కారాల దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని కూనంనేని సూచించారు.


More Telugu News