ఎవరీ రమీజ్ నెమత్?.. లాలూ కుటుంబంలో చిచ్చు పెట్టిన ఏస్ క్రికెటర్ ఇతడే!

  • తేజస్వి యాదవ్ ముఖ్య అనుచరుడిగా రమీజ్ నెమత్
  • రమీజ్‌పై రెండు హత్య కేసులు సహా 12 కేసుల నమోదు
  • లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఆరోపణలతో వెలుగులోకి 
  • 2025 ఎన్నికల్లో తేజస్వి సోషల్ మీడియా విభాగానికి ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు
  • యూపీకి చెందిన మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్‌కు రమీజ్ అల్లుడు
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో మొదలైన విభేదాలు, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ ముఖ్య సలహాదారు రమీజ్ నెమత్ నేర చరిత్రను వెలుగులోకి తెచ్చాయి. తేజస్వి సోదరి రోహిణి ఆచార్య చేసిన బహిరంగ విమర్శలతో రమీజ్ పేరు తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రమీజ్‌పై రెండు హత్య కేసులు సహా పలు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

స్థానిక రికార్డుల ప్రకారం, యూపీలోని బలరాంపూర్ జిల్లాకు చెందిన రమీజ్‌పై సుమారు 12 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిలో రెండింటిని న్యాయస్థానం కొట్టివేసింది. 2022 నాటి ఒక హత్య కేసులో జైలుకు వెళ్లిన ఆయన, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి నవంబర్ 20న కోర్టు తీర్పు వెలువడనుంది. ఇది కాకుండా, కౌశాంబి జిల్లాలో నమోదైన మరో హత్య కేసులో 2024 ఆగస్టులో అరెస్ట్ అయి, 2025 ఏప్రిల్‌లో బెయిల్ పొందారు.

రమీజ్ నెమత్.. తేజస్వి యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా, ఆయన కోర్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచార బాధ్యతలు, ముఖ్యంగా సోషల్ మీడియా విభాగాన్ని ఆయనే చూసుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం లాలూ కుటుంబంలో మొదలైన అంతర్గత కలహాలకు తేజస్వి సలహాదారులైన సంజయ్ యాదవ్, రమీజ్ నెమత్‌లే కారణమని రోహిణి ఆచార్య ఆరోపించడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది.

రమీజ్.. యూపీకి చెందిన మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్ అల్లుడు. ఢిల్లీలో చదువుకున్న ఆయన, జామియా మిలియా ఇస్లామియా నుంచి ఎంబీఏ పట్టా పొందారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన క్రికెటర్‌గా ఢిల్లీ, ఝార్ఖండ్ తరఫున వివిధ స్థాయుల్లో ఆడారు. వివాహం తర్వాత మామ ఇంట్లోనే నివసిస్తూ స్థానికంగా ప్రాబల్యం పెంచుకున్నారు.


More Telugu News