నా పేరుతో వాట్సాప్‌లో మోసాలు.. జాగ్రత్తగా ఉండండి: అదితి రావు హైదరీ

  • ఫొటోషూట్‌ల కోసం ఫొటోగ్రాఫర్లకు మెసేజ్‌లు చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తి
  • తాను వ్యక్తిగత నంబర్ నుంచి ఎవరినీ సంప్రదించనని అదితి స్పష్టం
  • పనులన్నీ తన టీమ్ ద్వారానే జరుగుతాయని వెల్లడి
  • ఆ నంబర్‌తో ఎవరూ మాట్లాడవద్దని, అనుమానం వస్తే తన టీమ్‌కు చెప్పాలని సూచన
ప్రముఖ నటి అదితి రావు హైదరి తన పేరుతో వాట్సాప్‌లో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలను హెచ్చరించారు. తన ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకుని, ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫొటోగ్రాఫర్లను సంప్రదిస్తూ ఫొటోషూట్‌ల గురించి మాట్లాడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు.

ఈ విషయంపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. "కొంతమంది నా దృష్టికి తెచ్చిన ఓ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వాట్సాప్‌లో ఎవరో నా ఫొటో పెట్టుకుని, నేనే అన్నట్లుగా ఫొటోగ్రాఫర్లకు మెసేజ్‌లు చేస్తున్నారు. అది నేను కాదు. నేను వ్యక్తిగతంగా ఎవరినీ ఇలా సంప్రదించను. నా పనులన్నీ నా టీమ్ చూసుకుంటుంది" అని ఆమె స్పష్టం చేశారు.

అలాగే, "దయచేసి ఆ నంబర్‌తో ఎవరూ మాట్లాడొద్దు. అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే నా టీమ్‌కు తెలియజేయండి. నాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని అదితి తన పోస్టులో పేర్కొన్నారు. అభిమానులు, సహచరులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'హీరామండి: ది డైమండ్ బజార్' వెబ్ సిరీస్‌లో అదితి రావు హైదరి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. తెలంగాణలోని వనపర్తి రాజవంశానికి చెందిన అదితి, ఇటీవల వనపర్తి చీరల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా తెలిసిందే.


More Telugu News