96 లక్షల ఫాలోవర్లు ఉన్నా... బీహార్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు!

  • బీహార్ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రముఖ యూట్యూబర్ మనీశ్ కశ్యప్
  • చన్‌పటియా నుంచి జన్‌సురాజ్‌ అభ్యర్థిగా పోటీ
  • 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఘోర పరాజయం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ యూట్యూబర్ మనీశ్ కశ్యప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జన్‌సురాజ్‌ పార్టీ అభ్యర్థిగా చన్‌పటియా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన, శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఘోర పరాజయం చవిచూశారు. సోషల్ మీడియాలో 96 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ, రాజకీయాల్లో అనుభవజ్ఞులైన ప్రత్యర్థుల ముందు ఆయన నిలవలేకపోయారు.

చన్‌పటియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ రంజన్... బీజేపీ అభ్యర్థి ఉమాకాంత్ సింగ్‌పై 37,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, ఇదే స్థానం నుంచి పోటీ చేసిన 34 ఏళ్ల మనీశ్ కశ్యప్ ఏకంగా 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సోషల్ మీడియాలో ఉన్న ప్రజాదరణ ఎన్నికల్లో ఓట్లుగా మారలేదు.

యూట్యూబర్‌గా బీహార్‌లో మంచి గుర్తింపు పొందిన మనీశ్ కశ్యప్, 2023లో తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. తమిళనాడులో బీహార్‌కు చెందిన వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ ఆయన రూపొందించిన కొన్ని వీడియోలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై తమిళనాడు, బీహార్ పోలీసులు విచారణ జరపగా, అవి నకిలీ వీడియోలని తేలింది. తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో అప్పట్లో ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. ఆ తర్వాత 2024లో బీజేపీలో చేరిన మనీశ్, అనంతరం జన్‌సురాజ్‌ పార్టీ టికెట్‌పై ఈ ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 


More Telugu News