ఆసుపత్రి ముందే భార్య దారుణ హత్య.. చంపేసి పోలీసులకు ఫోన్ చేసిన భర్త!

  • విజయవాడలో నర్సుగా పనిచేస్తున్న భార్య దారుణ హత్య
  • ఆమె పనిచేస్తున్న ఆసుపత్రి వద్దే భర్త కిరాతక దాడి
  • కత్తితో పొడిచి, గొంతు కోసి కిరాతకంగా చంపిన వైనం
  • హత్య చేసిన అనంతరం పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన నిందితుడు
  • ప్రేమ వివాహం తర్వాత మనస్పర్థలు..కోర్టులో విడాకుల కేసు
విజయవాడ నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆమె పనిచేస్తున్న ఆసుపత్రి వద్దే మాటువేసి కత్తితో పొడిచి, గొంతు కోసి చంపాడు. అనంతరం తానే స్వయంగా పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి లొంగిపోయాడు. విజయవాడ సూర్యారావుపేటలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతి (30) విజయవాడలోని విన్స్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్నారు. కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన విజయపాల విజయ్‌కు ఆమెతో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. సుమారు మూడేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, కొంతకాలంగా విజయ్‌ తన భార్య సరస్వతిపై అనుమానం పెంచుకుని తరచూ గొడవపడి వేధించేవాడు. భర్త వేధింపులు భరించలేక ఆమె కుమారుడిని తీసుకుని నూజివీడులోని పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడి నుంచే రోజూ విధులకు హాజరవుతోంది.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తీవ్రం కావడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం వీరి కేసు కోర్టులో విచారణ దశలో ఉంది. గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సరస్వతి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ కాపుకాచిన విజయ్‌, ఆమెను అడ్డగించి తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి, గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది.

స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా, విజయ్‌ కత్తి చూపిస్తూ వారిని బెదిరించాడు. సరస్వతి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత, అక్కడి నుంచే పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి భార్యను హత్య చేసినట్లు సమాచారం ఇచ్చాడు. వెంటనే సౌత్‌ ఏసీపీ పవన్ కుమార్‌, సీఐ ఆలీ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News

Vijayawada Vijayapala Vijay nurse murder wife killed Suryaraopet Vins Hospital marital dispute police investigation crime news Andhra Pradesh