అది భక్తి కాదు... రాజకీయ నటన: పవన్ కల్యాణ్ పై రోజా ఫైర్

  • సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు... మండిపడ్డ రోజా
  • పవన్ ఆందోళనంతా రాజకీయ నటన అని విమర్శ
  • చంద్రబాబును రక్షించడానికే ధర్మంపై మాట్లాడుతున్నారని ఆరోపణ
  • పవన్ ప్రసంగాల్లో చిత్తశుద్ధి లోపించిందని వ్యాఖ్య
  • తిరుమలకు బోర్డులు కాదు నిజాయతీ అవసరమని స్పష్టం
  • ముందు నిలకడగా ఉండటం నేర్చుకోవాలని పవన్‌కు హితవు
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రోజా కూడా పవన్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ ధర్మం గురించి మాట్లాడటం కేవలం రాజకీయ నటన అని, అందులో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆమె ఆరోపించారు.

"పవన్ కళ్యాణ్ గారూ, మీరు పవిత్రత, ధర్మం గురించి మాట్లాడిన ప్రతీసారి మీ పక్షపాత వైఖరి స్పష్టంగా బయటపడుతుంది. మీ ఆందోళన కేవలం ఎంపిక చేసుకున్న అంశాలకే పరిమితమని తెలిసిపోతుంది. తిరుమలలో భక్తులు చనిపోయినప్పుడు గానీ, వ్యవస్థలో తీవ్రమైన లోపాలు బయటపడినప్పుడు గానీ మీ నోరు పెగలలేదు. కానీ, ఎప్పుడైతే చంద్రబాబుకు ఒక రక్షణ కవచం అవసరమవుతుందో, అప్పుడు హఠాత్తుగా మీరు ధర్మం గురించి ప్రవచనాలు మొదలుపెడతారు.

దీన్ని భక్తి అనరు, స్వచ్ఛమైన రాజకీయ నటన అంటారు. మీరు నిజాయతీ గురించి మాట్లాడతారు, కానీ నిజాయతీ అంటే మనకు అసౌకర్యంగా ఉన్నప్పుడు కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పగలగడం. మీరు ఆ పని ఎప్పుడూ చేయలేదు. మీ సొంత మిత్రపక్షాల నుంచి జవాబుదారీతనం రాబట్టాల్సిన సమయం వచ్చినప్పుడు మౌనంగా ఉంటూ, సులభమైన లక్ష్యాలను ఎంచుకుని విమర్శలు చేస్తారు. అందుకే మీ ధర్మోపన్యాసాలు డొల్లగా వినిపిస్తున్నాయి.

ధర్మం గురించి గొప్ప ప్రసంగాలు ఎవరైనా ఇవ్వగలరు. కానీ అసలైన అవసరం వచ్చినప్పుడు దాని కోసం నిలబడే ధైర్యం ఎవరికి ఉంది అన్నదే అసలైన ప్రశ్న. ఆ పరీక్షలో మీరు ప్రతీసారీ విఫలమయ్యారు. తిరుమల సమస్యలను ఏదో ఒక బోర్డు లేదా కమిటీ పరిష్కరించదు. చిత్తశుద్ధి, నిజాయతీ మాత్రమే పరిష్కరించగలవు. కానీ ఆ రెండూ మీ రాజకీయాల్లో కొరవడ్డాయి.

ఇతరులకు నీతులు చెప్పే ముందు, ముందు మీరు నిలకడగా ఉండటం నేర్చుకోండి. తిరుమలకు కావాల్సింది చిత్తశుద్ధి... మీలాంటి వారి స్క్రిప్టెడ్ ఆక్రోశాలు కాదు" రోజా హితవు పలికారు.


More Telugu News