లెస్బియన్ భాగస్వామి కోసం కొడుకును చంపిన మహిళ
- భార్య ఫోన్ చెక్ చేసిన భర్తకు షాక్
- మరో మహిళతో సన్నిహితంగా భార్య ఫొటోలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూర్లో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కెలమంగళం సమీపంలోని చిన్నట్టి అనే గ్రామంలో సురేష్, భారతి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.. ఇటీవలే కుమారుడు పుట్టాడు. బాబు వయసు ఐదు నెలలు. అయితే, మూడు రోజుల క్రితం బాబు చనిపోయాడు. పాలు పడుతుండగా పొలమారి ఊపిరి ఆడక చనిపోయాడని చెబుతూ భారతి కన్నీటిపర్యంతమైంది. బాబు మరణంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగింది. కుటుంబ సభ్యులు కన్నీటితో బాబుకు అంత్యక్రియలు జరిపారు.
ఆ తర్వాత భారతి ప్రవర్తనలో మార్పు చూసి సురేష్ అనుమానించాడు. భారతి మొబైల్ చెక్ చేయగా అందులో షాకింగ్ ఫొటోలు కనిపించాయి. భారతి స్వలింగ సంపర్కురాలని, సుమిత్ర అనే మహిళతో అనుచిత బంధం నెరుపుతోందని గుర్తించాడు. దీంతో కుమారుడి మరణం సహజమైందేనా లేక భార్యే చంపేసిందా అనే అనుమానంతో పోలీసులను ఆశ్రయించాడు. సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. భారతి, సుమిత్రలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భర్త సురేష్ తో పాటు కుటుంబ సభ్యులందరూ పనికి వెళ్లిన సమయంలో భారతే కొడుకును ఊపిరి ఆడకుండా చేసి చంపేసిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ దారుణ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.