హుస్సేన్ సాగర్ లో తేలిన తల్లీకూతుళ్ల మృతదేహాలు
- రెండేళ్ల కుమార్తెతో కలిసి తల్లి ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణం
- నీరా కేఫ్ సమీపంలో మృతదేహాలు.. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
- బహదూర్ పురాకు చెందిన తల్లీకూతుళ్లుగా గుర్తించిన పోలీసులు
చార్టెడ్ అకౌంటెంట్ అయిన కీర్తికకు పాతబస్తీకి చెందిన వ్యాపారవేత్త పృథ్విలాల్ తో వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు బియ్యారా ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. కీర్తిక తన కుమార్తెతో కలిసి బహదూర్ పురాలోని పుట్టింటికి చేరుకుంది. ఏడాదిన్నరగా తల్లిదండ్రులతోనే ఉంటోంది. ఈ క్రమంలోనే సోమవారం కుమార్తెతో కలిసి కీర్తిక హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
సోమవారం నుంచి తమ కూతురు, మనవరాలు కనిపించడం లేదని కీర్తిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుస్సేన్ సాగర్ లో గుర్తుతెలియని మహిళ మృతదేహం దొరకడంతో కీర్తిక తల్లిదండ్రులకు సమాచారం అందించగా.. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని కీర్తికదేనని వారు గుర్తించారు. కీర్తిక కూతురు కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. మంగళవారం నాడు పాప మృతదేహం హుస్సేన్ సాగర్ లో గుర్తించామని పోలీసులు తెలిపారు.