అమ్మాయిలు... మీరు సూపర్!... రికార్డ్ చేజింగ్ తో వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్

  • మహిళల ప్రపంచకప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం
  • చరిత్రలోనే అత్యధిక స్కోరు ఛేదించి ఫైనల్‌కు చేరిన టీమిండియా
  • అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన జెమీమా రోడ్రిగ్స్
  • కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి రికార్డు భాగస్వామ్యం
  • ఆస్ట్రేలియా 15 మ్యాచ్‌ల విజయ పరంపరకు బ్రేక్
  • మూడోసారి ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టిన భారత మహిళల జట్టు
మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా అద్భుతం సృష్టించింది. అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేస్తూ, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్లోకి అడుగుపెట్టింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో భారత్ చారిత్రక విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ (127 నాటౌట్) అద్భుత సెంచరీతో చెలరేగడంతో, 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 341/5 స్కోరుతో ఛేదించింది.

ఈ విజయంతో భారత్ మూడోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరగా, ఆస్ట్రేలియా 15 మ్యాచ్‌ల విజయ పరంపరకు తెరపడింది. అంతేకాకుండా, మహిళల, పురుషుల వన్డే ప్రపంచకప్ నాకౌట్ చరిత్రలోనే ఇది అత్యధిక విజయవంతమైన ఛేదనగా రికార్డు సృష్టించింది. 2015 పురుషుల ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఛేదించిన 299 పరుగుల రికార్డును భారత్ అధిగమించింది.

భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (10), స్మృతి మంధన (24) త్వరగా ఔటవ్వడంతో 47 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మూడో వికెట్‌కు 167 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.

హర్మన్‌ప్రీత్ ఔటైన తర్వాత కూడా జెమీమా ఒత్తిడికి గురికాలేదు. దీప్తి శర్మ (24), రిచా ఘోష్ (26), అమన్‌జోత్ కౌర్ (8 బంతుల్లో 15 నాటౌట్) కీలక సమయాల్లో రాణించి ఆమెకు మద్దతుగా నిలిచారు. అమన్‌జోత్ ఫోర్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేయగా, జెమీమా ఆనందంతో కన్నీటిపర్యంతమైంది. ఇది ఆమెకు ప్రపంచకప్‌లో తొలి సెంచరీ కావడం గమనార్హం.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119) సెంచరీతో కదం తొక్కగా, ఎల్లీస్ పెర్రీ (77), ఆష్లే గార్డనర్ (45 బంతుల్లో 63) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో నల్లపురెడ్డి శ్రీ చరణి, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, అద్భుతమైన పోరాట పటిమతో విజయం సాధించిన భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.


More Telugu News