కాంగ్రెస్ సమావేశంలో బంగ్లాదేశ్ జాతీయ గీతాలాపన.. తీవ్రంగా స్పందించిన షైనా ఎన్‌సీ

  • బంగ్లా జాతీయ గీతం పాడటం అవమానకరం, సిగ్గుచేటు అన్న షైనా ఎన్‌సీ
  • జాతీయ గీతం మన దేశభక్తిని, జాతీయతను సూచిస్తుందన్న షైనా
  • మరొక జాతీయ గీతాన్ని ఆలపించాలనుకుంటే దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరిక
అసోంలోని కరీంగంజ్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో బంగ్లాదేశ్ జాతీయ గీతం 'అమర్ సోనార్ బంగ్లా' ఆలపించడంపై శివసేన నాయకురాలు షైనా ఎన్‌సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆమె ఖండించారు. కాంగ్రెస్ సమావేశంలో బంగ్లా జాతీయ గీతం పాడటం అవమానకరమని, సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు.

అసోంలోని శ్రీభూమి పట్టణంలో జరిగిన కాంగ్రెస్ సేవాదళ్ సమావేశంలో బంగ్లా జాతీయ గీతం ఆలపించినట్లు ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆమె స్పందించారు. ఈ ఘటనను పలు రాజకీయ పార్టీలు, పలువురు తీవ్రంగా ఖండించారు.

ఈ నేపథ్యంలో షైనా ఎన్‌సీ మాట్లాడుతూ, అసోం కాంగ్రెస్ బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఆలపించిందని, ఇందిరా భవన్‌లో దీనిని ఆలపించారని విమర్శించారు. ఇంతకంటే అవమానకరమైన, సిగ్గుచేటైన విషయం మరొకటి ఉండదని అన్నారు. జాతీయ గీతం మన దేశభక్తిని, జాతీయతను సూచిస్తుందని, వేరే దేశ జాతీయ గీతాన్ని ఆలపించాలనుకుంటే వారు దేశం విడిచి వెళ్లాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

ఎస్ఐఆర్ (SIR - ప్రత్యేక సమగ్ర సవరణ)పై కూడా షైనా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఇది అవసరమని ఆమె అన్నారు. సీఏఏను అమలు చేయడాన్ని పశ్చిమ బెంగాల్ మంత్రి ఫర్హాద్ హకీమ్ వ్యతిరేకిస్తున్నారని, ఎందుకో చెప్పాలని నిలదీశారు. సీఏఏ అయినా, ఎన్ఆర్సీ అయినా, ఎస్ఐఆర్ అయినా.. తృణమూల్ కాంగ్రెస్ తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తోందని ఆమె ఆరోపించారు.


More Telugu News