గ్వాంగ్జౌలో ల్యాండ్ అయిన ఇండిగో విమానం.. స్వాగతం పలికిన చైనా

  • ఐదేళ్ల విరామం తర్వాత భారత్ - చైనా మధ్య విమాన సేవలు
  • కోల్‌కతా-గ్వాంగ్జౌ విమాన సేవలను ప్రారంభించిన ఇండిగో
  • చైనాకు స్వాగతం పలుకుతున్నామంటూ భారత్‌‍లోని చైనా రాయబారి ట్వీట్
గ్వాంగ్జౌలో దిగిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలోని ప్రయాణికులకు సోమవారం చైనా ఘనంగా స్వాగతం పలికింది. దాదాపు ఐదేళ్ల క్రితం గాల్వాన్ లోయ వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్న అనంతరం ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఐదేళ్ల విరామం అనంతరం భారత్-చైనా నడుమ ఇది మొదటి విమానం.

"అక్టోబర్ 27న ఉదయం, ఇండిగో ఎయిర్‌లైన్స్ 6E1703 విమానం చైనాలోని గ్వాంగ్జౌకు సురక్షితంగా చేరుకుంది. హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం" అని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్ 'ఎక్స్'లో పోస్టు చేశారు.

నిన్న అర్ధరాత్రి తర్వాత కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొదటి విమానం గాంగ్జౌకు బయలుదేరింది. మొదటి విమానం కోల్‌కతా నుంచి గాంగ్జౌకు టేకాఫ్ తీసుకుందని, నవంబర్ 11వ తేదీ నుంచి తాము కోల్‌కతా-గ్వాంగ్జౌ ఎయిర్ బస్ సర్వీసును ప్రతిరోజు నడుపుతామని ఇండిగో ప్రకటించింది.

ఈ ఏడాది ప్రారంభంలో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సమావేశమైన సమయంలోనే రెండు దేశాల మధ్య విమాన సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.


More Telugu News