విరాట్, రోహిత్‌కు దక్కని చోటు.. 2027 వరల్డ్ కప్ జట్టును అంచనా వేసిన ఏఐ

  • టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు అవకాశం
  • వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కేఎల్ రాహుల్‌కు
  • జట్టులోకి యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం బాగా పెరిగింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఏఐ టూల్ అయిన చాట్‌జీపీటీ.. 2027 వన్డే ప్రపంచకప్‌ కోసం భారత జట్టు ఎలా ఉండబోతోందో అంచనా వేసింది. అయితే ఈ అంచనా టీమిండియా అభిమానులకు, ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ల మద్దతుదారులకు ఊహించని షాకిచ్చింది. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఈ జట్టులో చోటు దక్కకపోవచ్చని చాట్‌జీపీటీ పేర్కొంది.

చాట్‌జీపీటీ అంచనా ప్రకారం, 2027 నాటికి భారత జట్టుకు యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడని తెలిపింది. ఇక రోహిత్, కోహ్లీ స్థానాల్లో యువ సంచలనాలు యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ జట్టులోకి వస్తారని స్పష్టం చేసింది. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటాడని పేర్కొంది.

బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్‌ సింగ్‌లతో పాటు స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉంటారని వెల్లడించింది. అనూహ్యంగా, గాయాలతో తరచూ జట్టుకు దూరమవుతున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఈ జట్టులో ఉంటాడని చాట్‌జీపీటీ తన లిస్టులో చేర్చింది. అయితే, ఇటీవల ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ పేసర్ హర్షిత్ రాణాకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుతం ఈ అంచనా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


More Telugu News