కోహ్లీ, రోహిత్ ఫెయిల్యూర్.. కారణం ప్రాక్టీస్ లేకపోవడం కాదు.. అసలు విషయం చెప్పిన బ్యాటింగ్ కోచ్!

  • ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో రోహిత్, కోహ్లీ విఫలం
  • సీనియర్ల వైఫల్యంపై స్పందించిన బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్
  • వారి ఫెయిల్యూర్‌కు ఆట మధ్యలో వర్షం అంతరాయాలే కారణమ‌ని వెల్ల‌డి
  • ఆటగాళ్లు సరైన సన్నద్ధతతోనే బరిలోకి దిగారని వ్యాఖ్య‌
  • వారి అనుభవాన్ని తక్కువగా అంచనా వేయొద్దని సూచన
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విఫలం కావడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. చాలా కాలం తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన వారిద్దరి సన్నద్ధతపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు. వారి వైఫల్యానికి ప్రాక్టీస్ లేకపోవడం కారణం కాదని, ప్రతికూల వాతావరణమే వారి ఆటను దెబ్బతీసిందని స్పష్టం చేశాడు.

బుధవారం మీడియాతో మాట్లాడిన కోటక్, మ్యాచ్‌కు పదేపదే వర్షం అడ్డుపడటంతో బ్యాటర్ల ఏకాగ్రత దెబ్బతిన్నదని తెలిపాడు. "రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఎంతో అనుభవజ్ఞులు. తొలి వన్డేలో వారి ప్రదర్శనపై వాతావరణం తీవ్ర ప్రభావం చూపింది. ప్రతి రెండు ఓవర్లకు ఒకసారి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి మళ్లీ మైదానంలోకి రావడం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా చాలా కష్టం. అదే సమయంలో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి ఉన్నా, వాళ్లు కూడా ఇలాగే ఇబ్బంది పడేవారు" అని ఆయన వివరించాడు.

ఆటగాళ్ల సన్నద్ధతపై వస్తున్న విమర్శలను కోటక్ తోసిపుచ్చాడు. "ఆస్ట్రేలియా పర్యటనకు రాకముందే వారిద్దరూ సరైన శిక్షణ తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్‌కు రిటైరైనా, వారు ఐపీఎల్‌లో నిరంతరం ఆడుతూనే ఉన్నారు. వారి ఫిట్‌నెస్, ప్రాక్టీస్ గురించి మాకు పూర్తి అవగాహన ఉంది. వారు జాతీయ క్రికెట్ అకాడమీలో కూడా శిక్షణ పొందుతారు. అంత సీనియర్ ఆటగాళ్ల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం సరైంది కాదు. వారిని ఒక మ్యాచ్ ఆధారంగా అంచనా వేయడం తొందరపాటు అవుతుంది" అని కోటక్ అభిప్రాయపడ్డాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన రోహిత్, కోహ్లీకి ఆస్ట్రేలియాతో తొలి వన్డే కలిసిరాలేదు. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ 8 పరుగులకే ఔట్ కాగా, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో కోహ్లీ డకౌట్ కావడం ఇదే తొలిసారి. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.


More Telugu News