జనజీవన స్రవంతిలో కలవండి.. మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

  • పోలీసు అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి
  • విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు మరువలేనివని కొనియాడిన సీఎం
  • అమరవీరుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా
  • సైబర్, డ్రగ్స్ నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులది అగ్రస్థానమని కితాబు 
  • తమ హయాంలో 16 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడి
మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో పలువురు మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో నేడు నిర్వహించిన ‘పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం’లో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, ముందుగా పోలీసు అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజానికి పోలీసులు ఒక నమ్మకాన్ని, భరోసాను ఇస్తారని కొనియాడారు. ప్రజల శాంతిభద్రతల కోసం పోలీసులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక 16 వేల కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తుచేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు విద్య, ఆర్థిక విషయాల్లో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశంలోనే అత్యధిక పరిహారం అందిస్తున్నామని ఆయన తెలిపారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్, డ్రగ్స్ వంటి కొత్త తరహా నేరాలు పుట్టుకొస్తున్నాయని, వాటిని ఎదుర్కోవడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని సీఎం ప్రశంసించారు. డ్రగ్స్‌పై పోరాటానికి ‘ఈగల్ టీమ్’ను, సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.


More Telugu News