భారత్‌లాగే పాక్ క్రికెటర్లతో మేం కరచాలనం చేయం: పాకిస్థాన్ వైమానిక దాడిపై ఆఫ్ఘాన్ క్రికెటర్ తీవ్ర స్పందన

  • ఈస్ట్రన్ పాక్టికా ప్రావిన్స్‌పై పాక్ వైమానిక దాడి ఘటనలో 8 మంది మృతి
  • పాకిస్థాన్‌ది పిరికి చర్యగా అభివర్ణించిన కరీం సాదిక్
  • మేం పఠాన్లం.. ఏ దాడులూ భయపెట్టలేవని వ్యాఖ్య
పాకిస్థాన్ వైమానిక దళం చేసిన దాడి ఘటనపై ఆఫ్ఘనిస్థాన్ మాజీ క్రికెటర్ కరీం సాదిక్ తీవ్రంగా స్పందించాడు. ఈ చర్యను పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ, ఇకపై భారత క్రికెటర్లలాగే తాము కూడా పాకిస్థాన్‌తో కరచాలనం చేయబోమని అన్నాడు. ఆఫ్ఘన్‌లోని ఈస్ట్రన్ పాక్టికా ప్రావిన్స్‌పై పాక్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు దేశవాళీ క్రికెటర్లతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కూడా దీనిని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో పాక్, శ్రీలంక జట్లతో జరగాల్సిన ముక్కోణపు సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆఫ్ఘన్ క్రికెట్ టీమ్ ప్రకటించింది.

పాక్ దాడిలో ఆఫ్ఘనిస్థాన్ యువ క్రికెటర్లు ముగ్గురు మృతి చెందారని కరీం సాదిక్ పేర్కొన్నాడు. తాము పఠాన్లమని, ఇలాంటి దాడులు తమను భయపెట్టలేవని స్పష్టం చేశాడు. పాకిస్థాన్ దాడిలో పలువురు సామాన్యులు, క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

తమ దేశంలో చాలామంది పేదలు ఉన్నారని, చాలామందికి కనీసం ఒక్కపూట తినడానికి కూడా లేదని, అలాంటి నిస్సహాయులపై పాకిస్థాన్ పిరికిపందలా దాడి చేసిందని సాదిక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటువంటి చర్యలు తమ క్రికెట్‌ను ఆపలేవని, టీమిండియా మాదిరిగానే తాము కూడా పాక్‌తో కరచాలనం చేయబోమని స్పష్టం చేశాడు.


More Telugu News