విశాఖ దోపిడీ కేసులో ఊహించని ట్విస్ట్.. కొడుకే సూత్రధారి.. స్టాక్ మార్కెట్ అప్పులే కారణం

  • విశాఖలో సంచలనం రేపిన దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
  • స్టాక్ మార్కెట్ నష్టాలతో అప్పులపాలైన 19 ఏళ్ల యువకుడు
  • స్నేహితులతో కలిసి సొంత ఇంట్లోనే దోపిడీకి పక్కా ప్లాన్
  • నానమ్మను, తనను కట్టేసి దొంగలు దోచారని నాటకం
  • సెల్‌ఫోన్‌ డేటాతో గుట్టురట్టు చేసిన పోలీసులు
  • సూత్రధారితో పాటు నలుగురు నిందితుల అరెస్ట్, సొత్తు స్వాధీనం
స్టాక్ మార్కెట్‌లో పెట్టిన పెట్టుబడులు భారీ నష్టాలను మిగల్చడంతో వాటి నుంచి బయటపడేందుకు ఓ యువకుడు స్నేహితులతో కలిసి సొంత ఇంట్లోనే దోపిడీకి పథకం వేశాడు. తానే బాధితుడినంటూ నాటకమాడి అందరినీ నమ్మించాలని ప్రయత్నించాడు. విశాఖపట్నంలో ఇటీవల కలకలం రేపిన ఈ దోపిడీ కేసును పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించి, అసలు నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు.

అస‌లేం జ‌రిగిందంటే..!
విశాఖలోని రెడ్డికంచరపాలెం ఇందిరానగర్‌కు చెందిన జీవీఎంసీ కాంట్రాక్టర్ ధర్మాల ఆనందకుమార్‌రెడ్డి కుమారుడైన కృష్ణకాంత్‌రెడ్డి (19), బీబీఎం రెండో సంవత్సరం చదువుతున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసి తీవ్రంగా నష్టపోయి అప్పులపాలయ్యాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక, తన స్నేహితులైన షేక్‌ అభిషేక్‌, అవసరాల సత్యసూర్యకుమార్‌, పరపతి ప్రమోద్‌కుమార్‌లతో కలిసి ఇంట్లో దొంగతనం నాటకానికి తెరలేపాడు.

తండ్రి హైదరాబాద్ వెళ్లడాన్ని అవకాశంగా తీసుకుని, ఈ నెల‌ 5వ తేదీ అర్ధరాత్రి దోపిడీకి ప్లాన్ వేశాడు. ముందుగానే ఇంట్లోని సీసీ కెమెరాలను పనిచేయకుండా చేసి, వెనుకవైపు తలుపు గడియ పెట్టకుండా వదిలేశాడు. పథకం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించిన స్నేహితులు, గుర్తు తెలియని వ్యక్తులుగా నమ్మించేందుకు హిందీలో మాట్లాడుతూ కృష్ణకాంత్‌తో పాటు అతని నానమ్మ యల్లయ్యమ్మను ప్లాస్టర్లతో కట్టేశారు. అనంతరం బీరువాలోని రూ. 3 లక్షల నగదు, 12 తులాల బంగారం తీసుకుని పరారయ్యారు. దోపిడీ తర్వాత ఇంటి ముందున్న కారులోనే పారిపోయి, దానిని మారికవలస వద్ద వదిలేశారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సాంకేతిక ఆధారాలు, సెల్‌ఫోన్ డేటాను విశ్లేషించారు. విచారణలో కృష్ణకాంత్‌ ప్రవర్తనపై అనుమానం రావడంతో, అతడిని తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. ఈ వివరాలను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. కృష్ణకాంత్‌రెడ్డితో పాటు అతని ముగ్గురు స్నేహితులను అరెస్టు చేసి, వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.


More Telugu News