Satya Kumar Yadav: జగన్ అనుమతులు అడగడం హాస్యాస్పదంగా ఉంది: మంత్రి సత్యకుమార్

Satya Kumar Yadav Criticizes Jagans Actions in Andhra Pradesh
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌కు వికృత మనస్తత్వం ఉందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు జగన్ అనేక కుట్రలు పన్నుతున్నారని, కోర్టుల్లో పదేపదే పిటిషన్లు వేస్తూ పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. 

నర్సీపట్నం పర్యటన వెనుక జగన్‌కు ఎలాంటి చిత్తశుద్ధి లేదని, కేవలం ఆర్భాటం, బలప్రదర్శన కోసమే ఆయన పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 5 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్‌లో ప్రయాణించే జగన్, 60 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనుమతులు అడగటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉత్తరాంధ్రలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటును అడ్డుకున్నారని, విశాఖలో ఆయన రాజకీయ కార్యకలాపాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ఆ ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే వాస్తవాలు తెలుస్తాయని మంత్రి సత్యకుమార్ హితవు పలికారు.

 గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కేవలం అబద్ధాలు, అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి సత్యకుమార్ తీవ్రంగా ఖండించారు. పేదలకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించిందని తెలిపారు. "గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీలు ఎన్ని మొండి గోడలతో నిలిచిపోయాయో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇప్పుడు మేము వాటిని పూర్తి చేస్తుంటే, ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తున్నారంటూ వైసీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. ఈ విషయంపై శాసనసభలో, మండలిలో చర్చకు వస్తే సమాధానం చెప్పలేక పారిపోతున్నారు" అని ఆయన ఆరోపించారు.

పీపీపీ విధానంపై జగన్‌కు కనీస అవగాహన లేదని సత్యకుమార్ ఎద్దేవా చేశారు. ఈ విధానంలో యాజమాన్య హక్కులు పూర్తిగా ప్రభుత్వం వద్దే ఉంటాయని, రాష్ట్రానికి ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. "మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నామని ఆరోపించడం తప్ప, దానికి ఒక్కటైనా ఆధారం చూపించగలరా?" అని జగన్‌కు సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణానికి మొత్తం రూ. 8,500 కోట్లు అవసరం కాగా, ఇప్పటివరకు కేవలం రూ. 1,550 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష జరిగిందని సత్యకుమార్ ఆరోపించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను గాలికొదిలేసి, నిధులన్నీ కేవలం పులివెందుల మెడికల్ కాలేజీకే మళ్లించారని విమర్శించారు. "జగన్ రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రిగా పనిచేశారా? లేక కేవలం పులివెందులకేనా?" అని ఆయన ప్రశ్నించారు. 


Go Back to Shorts
Satya Kumar Yadav
Jagan Mohan Reddy
Andhra Pradesh
Medical Colleges
PPP model
Narsipatnam
Pulivendula
Political News
AP Politics

More Telugu News