భారత్‌తో యుద్ధం జరిగే అవకాశం.. ఈసారి మాకే అనుకూలం: పాకిస్థాన్ రక్షణ మంత్రి

  • భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమన్న ఖవాజా ఆసిఫ్
  • ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను కోరుకోవడం లేదని వ్యాఖ్య
  • కానీ ముప్పు పొంచి ఉన్న మాట వాస్తవమని వెల్లడి
భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తమకు అనుకూల ఫలితాలు ఉంటాయని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. అయితే, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తాను కోరుకోవడం లేదని ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

ముప్పు పొంచివున్న మాట వాస్తవమని ఆయన అన్నారు. ఒకవేళ యుద్ధం జరిగితే గతంలో కంటే మెరుగైన ఫలితాలు పాకిస్థాన్ సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో ప్రజలంతా ఒకరితో ఒకరు వాదించుకున్నా, విభేదాలు ఉన్నా భారత్‌తో యుద్ధం వస్తే మాత్రం ఐక్యంగా ఉంటామని ఆయన అన్నారు. చరిత్రను పరిశీలిస్తే భారత్ ఎప్పుడూ ఒకే దేశంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ను భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల హెచ్చరించారు. భారత్ పూర్తిగా సన్నద్ధంగా ఉందని, ఆపరేషన్ సిందూర్ సమయంలో మాదిరి సహనం ఈసారి ప్రదర్శించబోమని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ ప్రపంచ పటంలో నిలబడాలంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపి తీరాలని, లేదంటే ఆ దేశాన్ని చరిత్ర నుంచి తుడిచి పెట్టవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పైవిధంగా ప్రతిస్పందించారు.


More Telugu News