ఈ నెల 13న ఏపీ సీఎం చేతుల మీదుగా సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం

  • ముమ్మరంగా సాగుతున్న సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణ పనులు
  • ఈ నెల 11వ తేదీ నాటికి భవనాన్ని స్వాధీనం చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు
  • ప్రారంభోత్సవానికి సిద్దమవుతున్న సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం
ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తుది దశకు చేరుకున్న ఈ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మిగిలిన కొద్దిపాటి పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. ఈ నెల 13న కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

భవన ప్రారంభోత్సవాన్ని విజయదశమికి నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ, వర్షాల కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ నాటికి అన్ని పనులు పూర్తి చేసి భవనాన్ని స్వాధీనం చేయాలని కాంట్రాక్టర్‌ను అధికారులు ఆదేశించారు.

నూతన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ఈ కార్యాలయంలో సీఆర్డీఏ, ఏడీసీఎల్ (అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్), సీడీఎంఏ కార్యాలయాలతో పాటు పురపాలక శాఖ మంత్రి నారాయణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఛాంబర్‌లు ఉంటాయి.

అమరావతిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనం పూర్తి కానందున అధికారులు ఇప్పటి వరకు విజయవాడ లెనిన్ సెంటర్‌లోని కార్యాలయం నుండి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. 


More Telugu News