పాక్ కు రష్యా నిజంగానే సహకరిస్తోందా.. పుతిన్ ఏమన్నారంటే..!

  • యుద్ధ విమానాల ఇంజన్ల సరఫరా వార్తలపై రష్యా అధ్యక్షుడి స్పష్టత
  • పాకిస్థాన్ తో అలాంటి ఒప్పందమేమీ కుదుర్చుకోలేదని వివరణ
  • భారత్‌కు ఇబ్బందికరంగా మారే చర్యలు తాము చేపట్టబోమని వెల్లడి
భారత్ తమకు చిరకాల మిత్రుడని చెబుతూనే పాకిస్థాన్ తో రష్యా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోందని, యుద్ధ విమానాలకు ఇంజన్లు సరఫరా చేస్తోందని జరుగుతున్న ప్రచారాన్ని వ్లాదిమిర్ పుతిన్ కొట్టిపారేశారు. భారతదేశానికి ఇబ్బందికరంగా మారే చర్యలను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ చేపట్టబోమని స్పష్టం చేశారు. యుద్ధ విమానాల సరఫరా కోసం పాకిస్థాన్ తో తాము ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని పేర్కొన్నారు. భారత్‌తో పెద్ద ఎత్తున వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో.. పాక్‌కు మద్దతుగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారాలు చేయడం సరికాదని రష్యా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే.. ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.

అసలు ఏం జరిగిందంటే..
పాకిస్థాన్ సైన్యం వాడుతున్న జేఎఫ్ -17 ఫైటర్ జెట్ల (చైనా తయారీ) కు అవసరమైన ఇంజన్లను రష్యా సరఫరా చేస్తోందని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. ఈ నివేదికలను ఉటంకిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ బీజేపీపై మండిపడింది. ప్రధాని మోదీ రష్యాను అత్యంత సన్నిహితమైన వ్యాపార భాగస్వామిగా చెబుతారని, కానీ ఆ దేశం మన శత్రు దేశమైన పాక్‌కు మద్దతిస్తోందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైరాం రమేశ్‌ ఆరోపించారు.

ఇది ఇతర దేశాలతో సంబంధాల విషయంలో ప్రధాని మోదీ వైఫల్యాన్ని సూచిస్తుందని విమర్శించారు. జాతీయ ప్రయోజనాల కంటే ప్రధాని మోదీ తనకు పేరు వచ్చే విషయాలకే ప్రాధాన్యతనిస్తారని దుయ్యబట్టారు. రష్యా ఎందుకు పాక్‌కు సహకారాన్ని అందిస్తుందో మోదీ ప్రభుత్వం వివరించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ ఇప్పటికీ దౌత్యం విషయంలో పాక్‌ను ఒంటరిని చేయలేకపోతున్నారని జైరాం రమేశ్ విమర్శించారు.


More Telugu News