అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కాల్చివేత... హరీశ్ రావు స్పందన

  • అమెరికాలోని డల్లాస్‌లో తెలుగు విద్యార్థి దారుణ హత్య
  • దుండగుల కాల్పుల్లో పోలే చంద్రశేఖర్ అనే యువకుడు మృతి
  • మృతుడు హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన దళిత విద్యార్థి
  • బీడీఎస్ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన వైనం
  • మృతదేహాన్ని త్వరగా తరలించాలని ప్రభుత్వానికి హరీశ్ రావు విజ్ఞప్తి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి అక్కడ దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన దళిత యువకుడు పోలే చంద్రశేఖర్, డెంటల్ కోర్సు (బీడీఎస్) పూర్తిచేశాడు. అనంతరం ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికాలోని డల్లాస్‌కు వెళ్లాడు. అక్కడ శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ వార్త తెలియగానే అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఈ ఘటనపై హరీశ్ రావు స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. "ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతోంది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని పేర్కొన్నారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఉన్నత భవిష్యత్తు కోసం అగ్రరాజ్యం వెళ్లిన యువకుడు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం తెలుగు సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది.


More Telugu News