Chandrababu Naidu: పెళ్లికి వెళ్లి "రప్పా రప్పా" అంటూ దాడులు చేయటం ఎక్కడి సంస్కృతి?: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Slams Rappa Rappa Attacks in Andhra Pradesh Assembly
  • గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను వెంటేసుకుని తిరగడం దారుణం అంటూ ఫైరర్
  • ఏడుకొండలను రెండు కొండలు చేసినప్పటి నుంచే కుట్రలు మొదలు అని ఆరోపణ
  • పోస్టుమార్టానికి కారకులైన వారే పరామర్శలకు వెళుతున్నారని వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యర్థి పార్టీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొత్తగా ‘రప్పా రప్పా’ రాజకీయం మొదలైందని, పరామర్శలకు, శుభకార్యాలకు వెళ్లి విధ్వంసం సృష్టించడం ఎక్కడి సంస్కృతి అని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు, తిరుమల లడ్డూ వ్యవహారం, కూటమి ఎమ్మెల్యేల ప్రవర్తన, స్వర్ణాంధ్ర లక్ష్యాలపై సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు.

రప్పా రప్పా అంటూ దాడులు.. ఇదేం సంస్కృతి?
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా రప్పా రప్పా రాజకీయం వచ్చింది. ఒక నాయకుడు పర్యటన చేస్తే రప్పా రప్పా అంటున్నారు. అసలు పెళ్లికి వెళ్లి రప్పా రప్పా అంటూ దాడులు చేస్తారా? భద్రత కోసం వచ్చిన ఎస్ఐ గాయపడినా కనీసం పట్టించుకోలేదు. గంజాయి, డ్రగ్స్, బ్లేడ్ బ్యాచ్‌లను పక్కన పెట్టుకుని తిరిగే నాయకుడు దేశంలో ఎక్కడైనా ఉంటారా?’’ అని సీఎం ప్రశ్నించారు. 

కటౌట్లకు పొట్టేళ్ల రక్తంతో అభిషేకం చేయడం, నేరుగా హింసను ప్రోత్సహించడం ఫ్యాక్షనిజాన్ని తలపిస్తోందన్నారు. కేవలం 5 కిలోమీటర్ల దూరాన్ని వెళ్లేందుకు 6-7 గంటల సమయం తీసుకుంటూ, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే పెట్టుబడులు రద్దు చేస్తామంటూ ప్రతిపక్షంలో ఉండి హెచ్చరికలు జారీ చేయడం దేశ చరిత్రలో ఏ పార్టీ చేయలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టానికి కారకులైన వారే పరామర్శలకు వెళుతున్నారని ఎద్దేవా చేశారు.

లడ్డూ అపవిత్రం.. క్షమాపణ లేని దౌర్జన్యం
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై సీఎం స్పందిస్తూ, ఇది తెలియకుండా జరిగిన పొరపాటు కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర అని ఆరోపించారు. ‘‘ఏడు కొండలను రెండు కొండలు చేసినప్పటి నుంచే ఈ కుట్ర కొనసాగుతోంది. ఎన్డీడీబీ నివేదిక కూడా నెయ్యి కల్తీ జరిగిందని స్పష్టంగా తేల్చింది. దేశవ్యాప్తంగా పీఠాధిపతులు, హిందూ సంఘాలు ఖండించినా.. కనీసం ఆ పార్టీ క్షమాపణ చెప్పలేదు’’ అని అన్నారు. ప్రభువా క్షమించు అంటూ పత్రికల్లో రాతలు రాయించుకున్న వ్యక్తి, వెంకటేశ్వర స్వామికి మాత్రం క్షమాపణ చెప్పరా అని నిలదీశారు. తప్పు ఒప్పుకోకపోగా శాసనమండలిలో గొడవ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు.

అభివృద్ధి - శాంతిభద్రతలు
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మూడు ప్రాంతాల్లో ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు చేస్తున్నామని, సుప్రీంకోర్టు అనుమతితో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఉగాది నాటికి 3 లక్షల గృహప్రవేశాలు, సంజీవని ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధం చేస్తున్నామన్నారు. చివరగా, సోషల్ మీడియాలో సైకోల్లా వ్యవహరిస్తున్న వారిపై, వైట్ కాలర్ నేరగాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని, మహిళలపై నేరాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు అవుతుందని సీఎం తీవ్రంగా హెచ్చరించారు.


Chandrababu Naidu
Andhra Pradesh
Assembly
Rappa Rappa
TDP
Tirumala Laddu
AP Politics
Law and Order
Political Violence
Economic Development

More Telugu News