Harish Rao: కేరళలో ఎన్నికల ప్రచారం కోసం రేవంత్ సర్కార్ వందల కోట్లు తగలేస్తోంది: హరీశ్ రావు
- కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఖజానా ఏటీఎంలా మారిందన్న హరీశ్
- ఇక్కడ హామీలను విస్మరించి.. కేరళలో దొంగ ప్రచారం చేసుకుంటున్నారని మండిపాటు
- రాష్ట్రంలో రైతులను మోసం చేశారని విమర్శ
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని సాకులు చెబుతూ, కేరళ ఎన్నికల ప్రచారం కోసం వందల కోట్ల రూపాయిల తెలంగాణ ప్రజాధనాన్ని అడ్వర్టైజ్మెంట్ల రూపంలో తగలేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఖజానా ఒక 'ఏటీఎం'లా మారిందని దుయ్యబట్టారు.
మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500, తులం బంగారం, స్కూటీల హామీలను విస్మరించి, కేరళ పత్రికల్లో మాత్రం మహిళలను కోటీశ్వరులను చేశామని దొంగ ప్రచారం చేసుకుంటున్నారని హరీశ్ విమర్శించారు. ఏటా 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చకపోగా, నోటిఫికేషన్ల కోసం అడిగే విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయిస్తున్నారని మండిపడ్డారు.
ఇక్కడ వృద్ధులకు రూ. 4,000 పెన్షన్ ఇవ్వడానికి చేతులు రాని రేవంత్ రెడ్డికి... కేరళలో ఫుల్ పేజీ యాడ్స్ ఇవ్వడానికి కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. అబద్ధపు ప్రచారాల కోసం ఖర్చు చేసిన ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల రుణమాఫీకి కొర్రీలు పెట్టారని, రైతుబంధు ఆపేశారని, వరికి రూ. 500 బోనస్ ఇవ్వకుండా రైతుల పొట్టగొట్టారని ఆరోపించారు.