ఆపరేషన్ సిందూర్ 2.0 జరిగితే ప్రపంచపటంలో పాకిస్థాన్ ఉండదు: భారత ఆర్మీ చీఫ్ తీవ్ర హెచ్చరికలు

  • రాజస్థాన్‌లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పర్యటన
  • ఉగ్రవాదం ఆపకుంటే పాక్‌ను తుడిచిపెడతామన్న సైన్యాధిపతి
  • గతంలోలా ఈసారి సంయమనం చూపబోమని స్పష్టీకరణ
  • పాకిస్థాన్ ఉనికిపైనే ఆలోచించేలా చర్యలు ఉంటాయని హెచ్చరిక
  • ఎలాంటి పరిస్థితికైనా సైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపు
భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాకిస్థాన్‌కు అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే, పాకిస్థాన్‌ను ప్రపంచపటం నుంచే లేకుండా చేస్తామని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. దేవుడి అనుమతి ఉంటే అలాంటి అవకాశం త్వరలోనే లభిస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

రాజస్థాన్‌లోని అనుప్‌గఢ్‌లో ఉన్న ఆర్మీ పోస్టును సందర్శించిన సందర్భంగా ఆయన సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈసారి తాము గతంలోలా సంయమనం పాటించబోమని స్పష్టం చేశారు. 'ఆపరేషన్ సిందూర్ 1.0'లో ఉన్నట్లుగా కాకుండా, ఆపరేషన్ సిందూర్ 2.0లో పాకిస్థాన్‌పై మరింత తీవ్రమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

భవిష్యత్తులో తాము తీసుకునే చర్యలు, పాకిస్థాన్ తన ఉనికి గురించి ఆలోచించేలా చేస్తాయని జనరల్ ద్వివేది వ్యాఖ్యానించారు. భూమిపై ఉండాలనుకుంటే పాకిస్థాన్ తక్షణమే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలని గట్టిగా చెప్పారు. ఈ సందర్భంగా సైనికులు ఎలాంటి పరిస్థితులకైనా సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.


More Telugu News