అమెరికా విశ్వవిద్యాలయాలకు ఇండో-అమెరికన్ల భారీ విరాళాలు.. ఎందుకంటే?

ఇండో-అమెరికన్లు అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు భారీగా విరాళాలు అందజేస్తున్నట్లు ఒక నివేదిక ద్వారా వెల్లడైంది. ఇండియాస్పోరా సంస్థ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సంయుక్తంగా '2024 ఇంపాక్ట్ రిపోర్ట్' పేరుతో ఈ నివేదికను రూపొందించాయి. అమెరికా ఉన్నత విద్యావ్యవస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో భారతీయుల విరాళాలు ఏ విధంగా తోడ్పడుతున్నాయో ఈ నివేదిక వివరిస్తుంది.

తమ కెరీర్ ప్రారంభానికి తోడ్పాటునందించిన కళాశాలల అభివృద్ధికి అనేకమంది ఇండో-అమెరికన్లు విరాళాల రూపంలో సహాయం చేస్తున్నారని ఇండియాస్పోరా ఛైర్మన్ ఎంఆర్ రంగస్వామి తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో వారు విరాళాలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

దాదాపు 78 శాతం ఇండో-అమెరికన్లు బ్యాచిలర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యను అభ్యసించారు. ప్రస్తుతం 2,70,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. వీరి ద్వారా అమెరికాకు 10 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోంది. ఇది మన కరెన్సీలో సుమారు రూ. 83 వేల కోట్లు. 2008లో ఇండో-అమెరికన్లు అక్కడి విశ్వవిద్యాలయాలకు సుమారు రూ. 25,000 కోట్లు విరాళాలు అందజేశారు. ఈ విరాళాల్లో అధికభాగం మెడికల్, హెల్త్ సైన్స్, ఇంజినీరింగ్, బిజినెస్ ఎడ్యుకేషన్‌ రంగాలకు వెళుతున్నాయి. సాంస్కృతిక పరిరక్షణ కోసం సుమారు రూ. 1,170 కోట్లు విరాళాలు అందాయి.

MR Rangaswami
Indo Americans
America universities
donations
Indian students
higher education

More Telugu News